కొత్త బాధ్యతల్లోకి హన్మన్న

కాగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఎట్టకేలకు ఓ కీలక బాధ్యతల్లోకి దిగిపోయారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఇటీవలే రేవంత్ రెడ్డి సర్కారు ఆయనను నియమించగా… గురువారం ఆయన ప్రభుత్వ సలహాదారు బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్న కార్యక్రమంలో హన్మన్న కొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద తనదైన శైలిలో మంచి పలుకుబడి కలిగిన హన్మన్న రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదనే చెప్పాలి. 2016లో రాజ్యసభ సభ్యత్వం ముగియగా… అప్పటినుంచి ఆయన ఎలాంటి పదవి లేకుండానే నెట్టుకువస్తున్నారు. అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హన్మన్న… ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూనే సమకాలీన రాజకీయం చేస్తూ సాగుతున్నారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన హన్మన్న ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సంచలనమే. హన్మన్న నోటి నుంచి వచ్చే హాట్ హాట్ కామెంట్లు జనాన్ని ఇట్టే ఆకట్టుకునేవి. ఇటీవలి కాలంలో తనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలూ కోకొల్లలే.

అయితే ఆయన బాద అర్థం చేసుకున్నారో, లేదంటే అధిష్టానమే చెప్పిందో తెలియదు గానీ… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవిని అయితే ఇచ్చారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన అంశాల్లో ఆయన సలహాలను ప్రభుత్వం తీసుకోనుంది. ఈ హోదాలో హన్మన్న తెలంగాణ కేబినెట్ సమావేశాలకు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.