తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ తాజా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం సరికొత్త అవతారం ఎత్తారు. సీఎం పదవి నుంచి దిగిపోయిన దీదీ… గురువారం సరికొత్తగా న్యాయవాది అవతారం ఎత్తారు. న్యాయవాదుల వేషధారణలో బయలుదేరిన దీదీ.. నేరుగా కలకత్తా హైకోర్టుకు వెళ్లారు. కలకత్తా హైకోర్టులో విచారణకు రానున్న ఓ కీలక కేసులో తృణమూల్ కాంగ్రెస్ తరఫున స్వయంగా దీదీనే వాదనలు వినిపించనున్నారు. ఈ కారణంగానే దీదీ బ్లాక్ కోట్ వేసుకుని మరీ కోర్టుకు హాజరయ్యారు.
ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగానే సాగినా… మొన్నటిదాకా దీదీ పాలనలో ఉన్న బెంగాల్ లో మాత్రం హింస చోటుచేసుకుంది. పోలింగ్ సమయంలోనే కాకుండా పోలింగ్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ హింసపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా… దానిని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ పాల్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం విచారించనుంది.
ఈ విచారణకు తృణమూల్ తరఫున వాదనలు వినిపించేందుకు ఆ పార్టీ అదినేత్రిగా ఉన్న దీదీనే స్వయంగా రంగంలోకి దిగడం గమనార్హం. ఎన్నికల సమయంలో కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ హింసను ప్రేరేపించిందని, తృణమూల్ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసిన బీజేపీ నేతలు దౌర్జన్యకాండ సాగించారన్నది దీదీ ఆరోపణ.
బెంగాల్ లో ఈ దఫా ఎన్నికలు సవ్యంగా సాగలేదని, బీజేపీ దమన నీతితో జరిగిన ఎన్నికలను తాను ఒప్పుకునేది లేదని ఇదివరకే దీదీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే తాను సీఎం పదవికి రాజీనామా చేయబోనని కూడా ఆమె సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే దీదీ కోర్టుకు లాయర్ వేషధారణలో వచ్చారు. కోర్టులో దీదీ చేసే వాదనలపై దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates