వేణుగోపాల్ ని కాంగ్రెస్ ఎలా బుజ్జగిస్తుంది?

ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీ కేరళం సీఎం ఎంపికలోనూ తన నాన్చుడి ధోరణిని ప్రదర్శించింది. సీల్డ్ కవర్ సీఎం పరంపరను సొంతపార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నప్పటికీ మేమింతే అంటూ కాంగ్రెస్ భీష్మించుకు కూర్చుంది. 10 రోజుల తర్జనభర్జనలకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ రోజు సీఎం అభ్యర్థిని ప్రకటించింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీషన్ ను కాంగ్రెస్ హై కమాండ్ ఎంపిక చేసింది.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం సతీషన్ ధన్యవాదాలు తెలిపారు. యూడీఎఫ్ కు కేరళం ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారని అన్నారు. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన కేసీ వేణుగోపాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీ వేణుగోపాల్ తన మిత్రుడేనని, కలిసి పని చేస్తామని అన్నారు.

వాస్తవానికి సీఎం రేసులో కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేసీ వేణుగోపాల్ పేరు బలంగా వినిపించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వేణుగోపాల్ సీఎం అయ్యేందుకు తనవంతు ప్రచారం చేసి సహకారం అందించారు. కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్న వారిలో రేవంత్ ఒకరు. ఇక, పార్టీ హై కమాండ్ దగ్గర మంచి పేరున్న వేణుగోపాల్ సీఎం పదవి కోసం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో లాస్ట్ బాల్ వరకు ప్రయత్నించారు. ఆయనతో పాటు రమేశ్ చెన్నితల కూడా గట్టి ప్రయత్నాలే చేశారు.

దీంతో, సీఎం ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటిలాగే తన ట్రేడ్ మార్క్ నాన్చుడి ధోరణిని అవలంబించింది. దీంతో, కేరళంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నుంచి విమర్శలు మొదలయ్యాయి. మరోవైపు, కేరళంలో క్షేత్రస్థాయిలో సతీశన్‌కు కార్యకర్తల మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 63 సభ్యులతోపాటు 22 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యేల మద్దతు కూడా సతీషన్ కు ఉంది. దీంతో, సతీషన్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది.

అయితే, చాలాకాలంగా కాంగ్రెస్ కు దక్షిణాది రాష్ట్రాల ట్రబుల్ షూటర్ గా, జాతీయ స్థాయిలో సైతం కీలక నాయకుడిగా ఉన్న వేణు గోపాల్ తాజా పరిణామంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మరి, ఆయనను కాంగ్రెస్ హై కమాండ్ ఏ రకంగా బుజ్జగిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ డిప్యూటీ సీఎంగా ఆయనకు అవకాశమిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.