కేరళం ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తాజా మాజీ ప్రధాన ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ ఎంపికయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అదిష్ఠానం గురువారం ఉదయం ఓ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 4ననే కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ రికార్డు మెజారిటీతో విజయం సాధించింది. అయితే యూడీఎఫ్ తరఫున సీఎం ఎవరన్న విషయంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఓ నిర్ణయం తీసుకోలేకపోయింది. సీఎం రేసులో సతీషన్ తో పాటు పార్టీ సీనియర్ నేత రమేశ్ చెన్నితాల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ల పేర్లు ప్రదానంగా వినిపించగా… వారిలో సీఎం ఎవరన్న విషయాన్ని తేల్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం పెద్ద కసరత్తే చేసింది.
కేరళం కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా ఎదిగిన వీడీ సతీషన్… ఇప్పటిదాకా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2021లో జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ మరోమారు ప్రతిపక్షానికే పరిమితం కాగా… ప్రధాన ప్రతిపక్ష నేతగా పదవీ బాధ్యతలు చేపట్టిన సతీషన్… ఐదేళ్లలోనే పార్టీని ప్రతిపక్ష స్థానం నుంచి అదికార పార్టీగా తీర్చిదిద్దారు. కేరళం అసెంబ్లీలో పినరయి విజయన్ సర్కారుపై అలుపెరగని పోరు సాగించిన సతీషన్… ప్రజల్లో ఎల్ డీఎఫ్ పట్ల వ్యతిరేక వైఖరి నెలకొనేలా చేయడంతో పాటుగా ఓటర్లను యూడీఎఫ్ దిశగా మొగ్గేలా కీలక భూమిక వహించారు.
అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయిన నేపథ్యంలో సీఎం అభ్యర్థిని ముందుగా నిర్ణయించరన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని సతీషన్… తన పని తాను చేసుకుంటూ పోయారు. ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ను చిత్తు చేసిన సతీషన్ సీఎం పోస్టు కోసం తనంత తానుగా పెద్దగా ప్రయత్నాలే చేయలేదని చెప్పాలి. అయితే సీఎం రేసులోకి వచ్చిన నేతల అభ్యర్థిత్వాలను పరిశీలించిన ఏఐసీసీ… చివరకు సతీషన్ అభ్యర్థిత్వానికే ఓటేసింది. ఈ మేరకు కేరళం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ దీపా దాస్ మున్షీ గురువారం ఉదయం సతీషన్ ను కేరళం అసెంబ్లీలో కాంగ్రెస్ లెజెస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేతగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సతీషన్ కేరళం సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates