తమిళ మంత్రి కీర్తన.. గతంలో టీడీపీకి..?

తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకత్వానికి కొత్త గుర్తింపుగా నిలిచిన టీవీకే నేత ఎస్. కీర్తన సంపత్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. టీవీకే తరఫున శివకాశి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ అమ్మాయి, ఇప్పుడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేబినెట్‌లో మంత్రిగా చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది.

కేవలం 29 ఏళ్ల వయసులోనే తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచి, వెంటనే మంత్రివర్గంలో స్థానం సంపాదించడం ద్వారా కీర్తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శివకాశి నియోజకవర్గ చరిత్రలో 1957 తర్వాత మహిళా ఎమ్మెల్యేగా గెలిచిన తొలి నాయకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా పురుష అభ్యర్థుల ఆధిపత్యం కొనసాగిన ఈ స్థానంలో విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రాజకీయాల్లోకి రాకముందు కీర్తన రాజకీయ వ్యూహకర్తగా, డిజిటల్ ప్రచార నిపుణురాలిగా పనిచేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన సమయంలో టీడీపీ సోషల్ మీడియా విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. ఎన్నికల ప్రచార వ్యూహాలు, డిజిటల్ క్యాంపెయిన్లలో ఆమెకు మంచి అనుభవం ఉంది.

టీడీపీ ప్రచార బృందంలో పనిచేసిన అనుభవంతో తెలుగు భాషపై మంచి పట్టు సాధించిన కీర్తన, శివకాశి ఎన్నికల ప్రచారంలో తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగులో చర్చలు చేయడం విశేషం.

యువత, మహిళల మద్దతుతో ఆమె భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌తో కలిసి కీర్తన కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్న టీవీకేలో కీర్తన ఎదుగుదల ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.