దిగొచ్చిన మ‌మ‌త‌.. ఓట‌మి అంగీకారం?

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి.. మ‌మ‌తా బెన‌ర్జీ ఎట్ట‌కేల‌కు త‌న ఓట‌మిని అంగీక‌రించారు. గ‌త నెల‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మ‌మ‌త‌కు ప్ర‌జ‌లు భారీ షాకిచ్చారు. తొలిసారి ఇక్క‌డ బీజేపీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు మార్గం సుగ‌మం చేశారు. అయితే.. తాను ఓడిపోలేద‌ని.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి కూడా రాజీనామా చేసేది లేద‌ని మ‌మ‌త భీష్మించారు.

రాజ‌కీయంగా ఈ వ్య‌వ‌హారం దుమారానికి దారితీసింది. అయితే.. ఈ నెల 7వ తేదీతో బెంగాల్ అసెంబ్లీ కాల ప‌రిమితి ముగిసిపోవ‌డంతో గ‌వ‌ర్న‌ర్ ఆర్‌.ఎన్‌. ర‌వి.. అసెంబ్లీని ర‌ద్దు చేశారు. కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటు కు ఆహ్వానించారు. దీంతో తాజాగా శ‌నివారం ఉద‌యం బెంగాల్ ముఖ్య‌మంత్రిగా సువేందు అధికారి ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు తాను రాజీనామా చేసేది లేద‌ని పేర్కొన్న మ‌మ‌త .. ఈ ప్ర‌మాణ స్వీకారానికి కొద్ది సేప‌టి ముందు.. దాదాపు త‌న ఓట‌మిని అంగీక‌రించారు.

సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లోని బ‌యోలో భారీ మార్పు చేశారు. 15, 16, 17 శాస‌న స‌భ‌ల స‌భానేత‌ను మాత్ర‌మే అని పేర్కొన్నారు. దీంతో ఆమె ప్ర‌స్తుత శాస‌న‌స‌భ‌కు స‌భానేత(ముఖ్య‌మంత్రి) తాను కాద‌ని ఒప్పుకొన్న‌ట్టు అయింది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె ఎక్స్ బ‌యోలో.. అఖిల భార‌త తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్‌. బెంగాల్ ముఖ్య‌మంత్రి అని ఉంది. ఇప్పుడు దానిని తీసేయ‌డం ద్వారా.. తాను తాజా ఎన్నిక‌ల్లో గ‌ద్దెదిగిన‌ట్టు ఆమె ఒప్పుకొన్నారు.

మ‌ళ్లీ పోటీ.. !

కాగా.. ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భవానీపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓడిపోయిన మ‌మ‌తా బెన‌ర్జీ.. మ‌రోసా రి త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సువేందు.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి గెలిచారు. 1) నందిగ్రామ్‌. 2) భ‌వానీపూర్‌. వీటిలో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న వ‌దులుకుంటారు. దీంతో ఆ స్థానం నుంచి మ‌మ‌త పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంటుంది. అప్పుడు మాత్ర‌మే ఆమె అసెంబ్లీలో అడుగు పెట్టే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది.