పవన్ అభిమానులు… కొత్త ట్రాప్ లో పడొద్దు…

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు, తీర్చిదిద్దుతున్న కథనాలు చూస్తే.. ఆయన మీద వీళ్లకు ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యం కలగక మానదు. ఆ పోస్టులు, వార్తలు చూస్తే పవన్ రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవాలని.. ఆయన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించాలని.. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయితే చూసి తరించాలని వాళ్లందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది.

తమిళనాట విజయ్ పార్టీ పెట్టి అద్భుత ఫలితాలు రాబట్టి, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్న నేపథ్యంలో పవన్ మీద వీళ్లంతా అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు. సాక్షి మీడియా అయితే మూడు రోజులుగా పవన్ ఒంటరి పోరు ఆకాంక్షిస్తూ అదే పనిగా వార్తలు వడిస్తోంది. వైసీపీ వాళ్లు కూడా సోషల్ మీడియాలో ఈ రకమైన వాదనే వినిపిస్తున్నారు.

ఈ పోస్టులు, వార్తల్ని పైపైన చూస్తే విజయ్ లాగే పవన్ కూడా పొత్తుల కోసం చూడకుండా, ఒంటరిగా పోటీ చేయాలని, ఆయన లాగే సీఎం అయిపోవాలని కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ లోతుగా అర్థం చేసుకుంటే అసలు విషయం బోధ పడుతుంది.

పవన్ పొత్తులు పెట్టుకోవడం గురించి తెగ బాధ పడుతూ ఆయన ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటుకోవాలనుకోవడంలో ఆంతర్యమేంటో ఏపీ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న వాళ్లకు తెలియందేమీ కాదు. పవన్ 2019లో ఒంటరిగానే పోటీ చేస్తే ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆయన జగన్ వ్యతిరేక ఓటును చీల్చారు. తెలుగు దేశం పార్టీకి గండి కొట్టారు. జనగ్ అధికారంలోకి తోడ్పడ్డారు.

2024 ఎన్నికల్లో కూడా పవన్ ఒంటరిగా పోటీ చేస్తే అదే జరిగేది. వైసీపీ వాళ్లే పవన్‌ తెలుగుదేశం పార్టీకి అనుకూలుడని, బి-టీం అని ఒక ముద్ర వేసి వదిలిపెట్టారు. జనాల్లో కూడా ఆ రకమైన భావనే ఉంది. జగన్‌కు పవన్‌ను శత్రువుగానే పరిగణిస్తారు. ఈ విషయమే అర్థం చేసుకుని.. తన పార్టీ ప్రయోజనాలను మించి జగన్‌ను గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతో పవన్ తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టారు. దీంతో అద్భుత ఫలితాలు రాబట్టారు.

భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో కానీ.. 2019లో జరిగిన తప్పును 2029లోనూ పునరావృతం చేయకూడదని.. కూటమి ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరును ఉపయోగించుకుని మరోసారి పొత్తును కొనసాగించాలని పవన్ చూస్తున్నారు. కానీ వైసీపీ మద్దతుదారులు మాత్రం టీడీపీ, జనసేన కలిసి ఉంటే తమ పార్టీకి అవకాశం ఉండదని అర్థం చేసుకుని.. ఎలాగైనా పొత్తును విచ్ఛిన్నం చేయాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తమిళనాడు రాజకీయాలతో పోలిస్తే ఏపీ రాజకీయాలు భిన్నమైనవి, సంక్లిష్టమైనవి అని తెలిసి కూడా విజయ్‌తో పోలిక పెట్టి పవన్ ఒంటరిగా పోటీ చేయాలంటూ ఆయన్ని, జనసైనికులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వైసీపీ వాళ్లు ఎందుకిలా చేస్తున్నారో చాలామందికి అర్థమవుతున్నా.. కొందరు జనసైనికులు మాత్రం ఆ ట్రాప్‌లో పడి పవన్‌కు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. జన సైనికులు ఇది గ్రహించి మౌనంగా ఉండడం ఉత్తమం.

కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ ఎంతమాత్రం చలించరని.. ఆయనకు కూటమిని విచ్ఛిన్నం చేసే ఆలోచన ఎంతమాత్రం లేదని స్పష్టమవుతోంది. దీంతో వైసీపీ వాళ్లు ఎంత గింజుకున్నా.. పవన్ ఒంటరి పోరాటంతో ఓట్లు చీల్చడం, మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం సమీప భవిష్యత్తులో అసాధ్యంగానే కనిపిస్తోంది.