డీఎంకే-అన్నాడీఎంకేల‌లో చీలిక‌… రీజన్ ఒకడే!

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో విజ‌య్ పార్టీ టీవీకే 108 స్థానాల‌కు ప‌రిమితం కావ‌డం.. ఆయ‌న పార్టీకి ఎలా ఉన్న ప్పటికీ.. ప్ర‌ధాన ప‌క్షాలైన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల‌లో చీలిక‌లు తీసుకువ‌చ్చేందుకు దారి తీసింది. డీఎంకే మిత్రప‌క్షంగా ఉన్న కాంగ్రెస్‌పార్టీ.. టీవీకేతో చేతులుక‌లిపేందుకు రెడీ అయింది. వాస్త‌వానికి డీఎంకే-కాంగ్రెస్‌లు.. జాతీయ మిత్ర ప‌క్ష‌మైన ఇండియా కూట‌మిలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నా డు ఎన్నిక‌ల‌కు ముందు టీవీకే చేతులు క‌లిపేందుకు ప్ర‌య‌త్నించినా.. కాంగ్రెస్ వెన‌క్కి త‌గ్గింది.

అయితే.. ఇప్పుడు త‌మిళ‌నాడులో మారిన ప‌రిస్థితి, డీఎంకేను ప్ర‌జ‌లు ప‌క్క‌న పెట్టిన నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ త‌న దారి తాను చూసుకునేందుకు సిద్ధ‌మైంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో 38 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లోవిజ‌యం ద‌క్కించుకుంది. ఇప్పుడు ఈ ఐదుగురు ఎమ్మెల్యేల‌ను కూడా టీవీకేకు మ‌ద్ద‌తు ఇచ్చేలా వ్యూహాత్మ‌కంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. త‌ద్వారా.. మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకోవ‌డంతో పాటు రాజ్య‌స‌భ స్థానాన్ని కూడా ఆశిస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇక‌, మాజీ సీఎం ప‌ళ‌నిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేలో కూడా చీలిక రాజ‌కీయాలు తెర‌మీదకి వ‌చ్చాయి. ఈ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తాజాగా ఎన్నిక‌ల‌కు దిగింది. అయితే.. రెండో స్థానాన్ని కూడా కోల్పోయి.. కేవ‌లం 59 స్థానాల‌కే ప‌రిమితం అయింది. దీంతో అన్నాడీఎంకేలోని 15 మంది నుంచి 20 మంది వ‌ర‌కు ఎమ్మెల్యేలు.. టీవీకేతో జ‌ట్టు క‌ట్టేలా.. పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన పార్టీ ప‌క్ష స‌మావేశంలోనూ ఇదే ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు.

అయితే.. ఈప్ర‌తిపాద‌న‌కు ప‌ళ‌ని స్వామి తిర‌స్క‌రించారు. దీంతో బుధ‌వారం 15 మందిఎమ్మెల్యేలు.. టీవీకే పార్టీకి తాము మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ.. విజ‌య్‌కు వ‌ర్త‌మానం పంపించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే జరిగితే.. అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఖాయ‌మ‌ని అంటున్నారు. అటు డీఎంకేలోని మిత్ర ప‌క్షం కాంగ్రెస్ బ‌య‌ట‌కు రావ‌డం.. ఇటు అన్నాడీఎంకేలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసేందుకురెడీ కావ‌డంతో త‌మిళ‌నాట రాజ‌కీయాలు మ‌రింత ఆస‌క్తిగా మారాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.