అక్కడ కూడా కాంగ్రెస్ లో సీఎం సీటు పంచాయతీ!

కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట… పాత పద్ధతులు…వెరసి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోల్పోయింది. బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త
విదానాలు, వ్యూహాలు రచిస్తూ మునుపెన్నడూ గెలువని రాష్ట్రాలలో కూడా భారీ విజయాలు సాధిస్తుంటే…కాంగ్రెస్ మాత్రం తమ తమకు కంచుకోట వంటి స్థానాలను కూడా స్వయంకృతాపరాధాలతో
బద్దలు కొట్టించుకుంటోంది.

ఇక, కాంగ్రెస్ పార్టీకి అది పెద్ద తలనొప్పి అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు. పార్టీలో సీనియర్, జూనియర్ నేతలకు మధ్య సఖ్యత లేకపోవడం..సీఎం కుర్చీ కోసం సిగపట్లు… ఈ బలహీనతల వల్లే ప్రత్యర్థి పార్టీలకు కాంగ్రెస్ లోకువైంది.

కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారం కోల్పోయిన సరే ఆ పార్టీ నేతల తీరు మారినట్లు కనిపించడం లేదు. కేరళంలో యూడీఎఫ్ విజయం సాధించే దిశగా ఆధిక్యంలో కొనసాగుతుండగా…సీఎం ఎవరు అన్న పంచాయతీ మొదలైంది.

నేనంటే నేను అంటూ ముఖ్యమంత్రి కుర్చీ కోసం మ్యూజికల్ చెయిర్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో సీఎం సీట్ ఫైట్ కొత్త కాదు. కానీ, ఓ పక్క బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సైతం బీజేపీ పాగా వేస్తోంటే… కాంగ్రెస్ మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ కోసం తమ పార్టీ నేతల మధ్య జరిగే ముష్టియుద్ధాలను ఆపలేకపోతోంది.

ఇప్పటికైనా పాత చింతకాయ పచ్చడి పద్ధతులు మార్చుకొని… రోటీన్ సీఎం సీటు పంచాయతీలు ఎన్నికలకు ముందే తేల్చుకొని కాంగ్రెస్ తన తప్పులు సరిదిద్దుకోకుంటే రాబోయే ఎన్నికల్లోనూ ఆ పార్టీ నుంచి పెద్దగా అద్భుతాలు ఆశించడం అనవసరం.