స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి.. దీదీ కోటలో బీజేపీ మ్యాజిక్!

పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట బద్ధలయ్యింది. 2011 నుండి బెంగాల్‌ను పాలిస్తున్న మమతా బెనర్జీ సర్కార్ పతనం అంచున నిలబడగా, భారతీయ జనతా పార్టీ అద్భుత విజయంతో అధికార పీఠం వైపు దూసుకుపోతోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి వరకు బెంగాల్ గడ్డపై ఒక్కసారి కూడా బీజేపీ అధికారంలోకి రాలేదు, కానీ తాజా ఫలితాలతో ఆ రికార్డు చెరిగిపోబోతోంది.

ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు మమతా బెనర్జీ, ఆమె ఒకప్పటి అనుచరుడు సువేందు అధికారి మధ్యే సాగింది. ముఖ్యమంత్రికి సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో సువేందు గట్టి సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన దీదీ, ఈసారి తన ఇలాకాలో కూడా ప్రతిపక్ష నేత ధాటిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓటర్ల జాబితాలో జరిగిన భారీ మార్పులు, అభివృద్ధి నినాదం కాషాయ పార్టీకి కలిసి వచ్చినట్లు క్షేత్రస్థాయి ఫలితాలు చెబుతున్నాయి.

బెంగాల్ అసెంబ్లీలోని 294 స్థానాల్లో మేజిక్ ఫిగర్ 148 దాటడానికి బీజేపీ తీవ్రంగా శ్రమించింది. 2021 ఎన్నికల్లో కేవలం 77 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ, ఈసారి ఏకంగా అధికారాన్ని కైవసం చేసుకునే స్థాయికి ఎదగడం విశేషం. మరోవైపు ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఈసారి కూడా తమ ఉనికిని చాటుకోలేకపోయాయి. హుమాయున్ కబీర్ లాంటి నేతలు కొత్త పార్టీలు పెట్టినా, అల్టిమేట్ గా ప్రజలు మాత్రం మార్పు వైపు మొగ్గు చూపారు.

ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరిగిన పోలింగ్‌లో ఓటర్లు మమత సర్కార్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్లు ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం కమ్యూనిస్టుల కోటను కూల్చిన దీదీకి, ఇప్పుడు అదే తరహాలో పరాజయం ఎదురవ్వడం రాజకీయాల్లో పెను సంచలనం.

క్షేత్రస్థాయిలో పెరిగిన ప్రజా వ్యతిరేకత, సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ చేసిన దూకుడు ప్రచారం తృణమూల్ విజయవకాశాలను దెబ్బతీశాయి. ఈ విజయం దేశ రాజకీయాల్లోనూ పెద్ద చర్చకు దారితీయనుంది. ఒక ప్రాంతీయ శక్తిని ఓడించి జాతీయ పార్టీ జెండా పాతడం బీజేపీకి పెద్ద విజయం. పదిహేనేళ్ల సుదీర్ఘ పాలన తర్వాత బెంగాల్ ప్రజలు కోరుకున్న ఈ మార్పు రాష్ట్ర భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.