ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సువార్తీకుడు కేఏ పాల్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ చీఫ్.. కల్వకుంట్ల కవితపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం తండ్రితో ఉన్న విభేదాల కారణంగానే కవిత సొంత కుంపటి పెట్టుకున్నారని.. అదే కేసీఆర్.. ఆమెకు కోరుకున్న పదవి ఇచ్చి ఉంటే పార్టీ పెట్టేదా? అని ప్రశ్నించారు. కవితకు ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక దండిగా ఉందన్నారు.
కానీ, కేసీఆర్ ఆమెకు ఆ పదవి ఇవ్వలేదన్నారు. అందుకే కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారని వ్యాక్యానించారు. వాస్తవానికి 2008లోనే కవిత సొంత పార్టీ కోసం ప్రయత్నం చేశారని పాల్ ఆరోపించారు. ఈ సమయంలో తనను 10 కోట్ల రూపాయలు కావాలని కోరారని.. కానీ, కేసీఆర్ ఒప్పుకోలేదని చెప్పారు. కేసీఆర్ ఒప్పుకొని ఉంటే.. తాను 15 కోట్ల రూపాయల సొమ్ము ఇచ్చి ఉండేవాడినని పాల్ అన్నారు. అప్పటి నుంచే ఆమెకు ముఖ్యమంత్రి పీఠంపై కన్నుందన్నారు.
ప్రజలకు సేవ చేసేందుకు కవిత పార్టీ పెట్టలేదని.. తన పదవీ కాంక్షను తీర్చుకునేందుకు పార్టీ పెట్టిందన్నారు. దీనివెనుక ఎవరు ఉన్నారో.. అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. కానీ.. ఎవరూ బయటకు చెప్పడం లేదన్నారు. తనే త్వరలో ఈ విషయాన్ని బయట పెడతానని పాల్ చెప్పారు. ఏపీలో జగన్-షర్మిల ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముకోసం కొట్టుకుంటున్నారని.. అలానే తెలంగాణలోనూ కవిత-కేటీఆర్ ప్రజల నుంచి దోపిడీ చేసిన సొమ్ము కోసం.. కొట్లాడుతున్నారని అన్నారు.
తెలంగాణ సమాజం కవితను ఒక జోకర్గా చూస్తోందని పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంట్లో వాళ్లు కూడా ఆమెకు ఓట్లు వేయరని వ్యాఖ్యానించారు. ప్రజల్లో కూడా కవిత ఎక్కువగా తిరగలేదని చెప్పారు. గతంలో చేసిన తప్పులపై ప్రజలు నిలదీసేందుకు రెడీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజాన్ని కుటుంబ పార్టీలు దోచుకున్నాయని ఆరోపించారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ.. ప్రజల మధ్యకు వస్తే.. కవితను నమ్మే వారు ఎవరు? అని ప్రశ్నించారు. కాగా.. అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో తాను బిజీగా ఉన్నానని పాల్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates