సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపికలో అప్పుడప్పుడూ చిత్రవిచిత్రాలు బయటపడుతూ ఉంటాయి. అలా బయటపడిన విచిత్రాలను సరిదిద్దడం అప్పటికప్పుడు సాధ్యం కాకపోవచ్చు. అయినా గానీ ఆగిపోవడం అనేది ఉండదు. ముందుకు సాగిపోతూనే ఉంటాయి మన ప్రభుత్వాలు. పేదల అభ్యున్నతి కోసం తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో తాజాగా ఓ వింత చోటచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉన్నా… ఆ పిల్లల తల్లికి ఏకంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇన్నాళ్లకు గానీ తాను ఓ ఇంటికి యజమానిని అయ్యానని ఆ తల్లి చెబుతుంటే…ఆమె పిల్లల ఉన్నతిని చూసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేయాలో పాలుపోక అలా ఉండిపోయారు.
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయా గ్రామాలు, పట్టణాల్లో పేదరికంలో మగ్గుతన్న కుటుంబాలను ఎంపిక చేస్తున్న అధికార యంత్రాంగం ఆయా కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు పేరిట ఓ గృహాన్ని నిర్మించి ఇస్తోంది. ఇలా లబ్ధిదారుల జాబితా రూపొందించే సమయంలో జరుగుతున్న పొరపాట్లను అదికార యంత్రాంగం ఎప్పటికప్పడు క్రాస్ చెక్ చేయాల్సి ఉన్నా… ఆ పని చేయడం లేదు. ఫలితంగా అప్పటికే పేదరికం నుంచి ఆయా కుటుంబాలు వెళ్లిపోయినా… వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వచ్చిన సంక్షేమ పథకాన్ని ఎందుకు కాదనాలి అన్న భావనతో అర్హత లేకున్నా ఆయా కుటుంబాలు ఆ లబ్ధిని స్వీకరిస్తున్నాయి.
ఈ తరహా ఘటన ఒకటి రెండు రోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో జరిగింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులతో సమావేశం సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుుంది. ఇందిరమ్మ ఇల్లు దక్కించుకున్న నీలమ్మ అనే మహిళ… మంత్రి సమక్షంలోనే వేదిక ఎక్కి… ఇన్నాళ్లకు గానీ తనకు ఓ ఇల్లు మంజూరు అయ్యిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీకెంత మంది పిల్లలు, వారేం చేస్తున్నారన్న మంత్రి ప్రశ్నలకు నిలమ్మ ఏమాత్రం తడుముకోకుండా తన కుటుంబ ఉన్నతిని ఇట్టే బహిర్గతం చేశారు.
తనకు నలుగురు పిల్లలున్నారని చెప్పిన నీలమ్మ… వారిలో చిన్న అబ్బాయి లండన్ వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు. ఇక పెద్ద కుమారుడు చాణక్య స్ట్రాటజీ పేరిట ఓ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. మిగిలిన ఇద్దరు ఆడపిల్లలని, వారు కూడా చదువుకు ముగించుకుని ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు.
ఇలా తన కుటుంబం పేదరికం నుంచి ఎప్పుడో బయటపడ్డా గానీ…ఇప్పటికీ తాను ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందుకుంటూనే ఉన్నానన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. అయితే ఆమె స్వయంగా చెప్పకున్నా… ఆమె వెల్లడించిన వివరాల ద్వారా ఆమె కుటుంబం దారిద్య్ర రేఖకు దిగువన ఏమీ లేదని తేటతెల్లమైంది. ఈ విషయం నీలమ్మకు తెలియకున్నా… మంత్రితో పాటు అక్కడున్న వారందరికీ అర్థమైపోయి…ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates