అన్ని క‌మిటీలూ ర‌ద్దు .. కేటీఆర్‌కు పూర్తి ప‌గ్గాలు?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ అధినేత‌.. కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. బీఆర్ ఎస్ రాష్ట్ర‌స్థాయి క‌మిటీ మిన‌హా.. ఇత‌ర అన్ని క‌మిటీల‌ను ఆయ‌న ఒక్క మాట‌తో ర‌ద్దు చేశారు. అంతేకాదు.. అదే స‌మ‌యంలో త‌న కుమారుడ‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంపూర్ణ బాధ్య‌త‌లు అప్ప‌గించేశారు. భ‌విష్య‌త్తులో పార్టీ నిర్ణ‌యాలు తీసుకునే స్వేచ్ఛ‌ను కూడా క‌ల్పించారు. అంటే.. ఒక‌ర‌కంగా.. కేసీఆర్ త‌న కుమారుడికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించేసిన‌ట్టు అయింది!

ప్ర‌స్తుతం బీఆర్ ఎస్‌లో జిల్లా, మండ‌ల స్థాయి క‌మిటీలు ఉన్నాయి. ఇవి క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేస్తున్నాయి. అయితే.. ప్ర‌స్తుతం పార్టీ ప‌రంగా ప్ర‌క్షాళ‌న చేయాల‌ని భావించిన కేసీఆర్‌.. అన్ని క‌మిటీలను ర‌ద్దు చేశారు. పార్టీ ఆవిర్భావ స‌ద‌స్సును హద‌రాబాద్‌లోని బీఆర్ ఎస్ భ‌వ‌న్‌లో ప‌రిమిత సంఖ్య‌లో నేత‌ల మ‌ధ్యే నిర్వ‌హించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎక్క‌డిక‌క్క‌డ స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించినా.. రాష్ట్ర‌స్థాయి స‌ద‌స్సును మాత్రం కేవ‌లం 200 మంది నాయ‌కుల స‌మ‌క్షంలోనే నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగానే కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

అదేస‌మ‌యంలో కొత్త నాయ‌క‌త్వాన్ని ఎంపిక చేసే బాధ్య‌త‌ను సంపూర్ణంగా కేటీఆర్ చేతిలో పెట్టారు. దీనికి సంబంధించిన విధి విధానాల‌ను కూడా కేటీఆర్ రూపొందించేందుకు..ఎవ‌రిని ఎంపిక చేయాలి? ఎవ‌రిని తీసుకోవాలి? అనే నిర్ణ‌యాన్ని కూడా ఆయ‌న‌కే వ‌దిలేశారు.. మొత్తంగా ఈ ప‌రిణామం..కేటీఆర్‌కు పూర్తిస్థాయిలో పార్టీపై ప‌ట్టును మ‌రింత పెంచేసిన‌ట్టు అయింది. అంతేకాదు.. జిల్లాలు, మండ‌ల‌స్థాయి నాయ‌కుల‌ను ఎంపిక చేసి వారితో క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు.. వారికి శిక్ష‌ణ ఇచ్చే బాధ్య‌త‌ను కూడా కేటీఆర్‌కు అప్ప‌గించారు.

జోరుగా స‌భ్య‌త్వాలు..

పార్టీ స‌భ్య‌త్వ నమోదు ప్ర‌క్రియ‌ను జోరుగా చేప‌ట్టాల‌ని కేసీఆర్ చెప్పారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ల‌లో ఈ స‌భ్య‌త్వాలు కొన‌సాగాల న్నారు. అన్ని జిల్లాలు, మండ‌లాలను ప్రాతిప‌దిక‌గా తీసుకుని.. ఈ స‌భ్య‌త్వ‌న‌మోదు ప్ర‌క్రియ కొన‌సాగాల‌న్నారు. త‌ద్వారా పార్టీని బ‌లోపేతం చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. కొత్త యువ‌త‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని.. అదేవిధంగా పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికి గుర్తింపు వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. వ‌చ్చేది అత్యంత కీల‌క స‌మ‌యం అన్న కేసీఆర్‌.. ప్ర‌తి ఒక్క‌రూ పార్టీ కోసం క‌ష్ట‌ప‌డాల‌ని.. అరాచ‌క కాంగ్రెస్‌ను గ‌ద్దె దింపే వ‌ర‌కు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.