టీడీపీ మహిళా ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్ జెండర్..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ ట్రాన్స్‌జెండర్‌ను తన వ్యక్తిగత సహాయకుని గా (పీఏగా) నియమించి సమాజంలో సమాన అవకాశాలకు కొత్త దిశ చూపించారు. ఏప్రిల్ 6న ఎమ్మెల్యేను కలిసిన ఆ ట్రాన్స్‌జెండర్, తాను విద్యావంతురాలినైనా ఉద్యోగం దొరకడం లేదని తన సమస్యను వివరించినట్లు తెలిసింది.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, కొద్ది రోజుల పాటు ఆమె పనితీరును పరీక్షించి, నైపుణ్యాన్ని గుర్తించి పీఏగా నియమించారు. ఇటీవల నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యేకు తోడుగా నిలిచి పనులను చురుకుగా నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ పరిణామంపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, గళ్లా మాధవి నిర్ణయాన్ని అభినందించారు.

ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని పీఏగా నియమించడం ద్వారా అణగారిన వర్గాల సాధికారతకు మార్గం సుగమం చేశారని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడం నిజమైన నాయకత్వ లక్షణమని అన్నారు.

ట్రాన్స్‌జెండర్ సమాజానికి గౌరవం, గుర్తింపు, ఉపాధి అవకాశాలు కల్పించడం అత్యవసరమని పేర్కొన్న ఆయన, గళ్లా మాధవి తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలో కావాల్సిన పురోగామి మార్పుకు గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు.

ఇటువంటి చర్యలు ఇతర ప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, సమాన హక్కులు, సమాన అవకాశాల సాధనలో ఇది మరో ముందడుగని లోకేష్ పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు సమాజంలోని ప్రతి వర్గాన్ని కలుపుకొని ముందుకు సాగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని సూచించారు.