ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు లభించింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో శనివారం సాయంత్రం చంద్రబాబు ఈ అవార్డును అందుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ `ఎకనమిక్ టైమ్స్` ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పరిశీలన చేసి… వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలకు ప్రాణం పోసిన వ్యక్తులను ఎంపిక చేస్తారు. వారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ ఏడాది 2026వ సంవత్సరానికి ఏపీ సీఎం చంద్రబాబును ఎంపిక చేశారు.
చంద్రబాబు ఏమన్నారంటే..
ఈ అవార్డు వేడుకలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని చెప్పారు. కేవలం ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా.. ఆయా పనులు ఎలా జరుగుతున్నాయన్నది ఆర్టీజీఎస్ ద్వారాసమీక్షలు నిర్వహిస్తూ.. పనుల్లో వేగం పెంచామని చెప్పారు.
ముఖ్యంగా గత రెండేళ్లలోనే రాష్ట్రానికి 20 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు తీసుకువచ్చామన్నారు. అదేసమయంలో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు నడిపించేందుకు అనేక పథకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. కేవలం రాష్ట్రమే ప్రాతిపదిక కాకుండా.. దేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మోడల్ విధానాలను అనుసరిస్తున్నట్టు తెలిపారు.
పీ-4 వంటి పథకంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా సమాజంలో పేదరికాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అనేక మంది దీనిలో భాగస్వాములు అయ్యారని.. పేదలను దత్తత తీసుకుని వారి విద్య, ఆర్థిక, ఉద్యోగ వ్యవహారాల్లో ఆపన్న హస్తం అందిస్తున్నారని పేర్కొన్నారు. దాదాపు 10 లక్షల మందిని ఇప్పటి వరకు దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. అదేసమయంలో మహిళలకు సాధికారత కల్పించే దిశగా అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, డ్రాక్వా సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు.
సంస్కరణలతో పాటు సాంకేతికతకు కూడా పెద్ద పీట వేస్తున్నామని సీఎం తెలిపారు. విజన్ 2020 ద్వారా నాడు హైదరాబాద్ను అన్ని విధాలా అభివృద్ది చేసినట్టే ఇప్పుడు విజన్-2047 ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో డెవలప్ చేసేందుకు కృషి చేస్తున్నా మన్నారు. ఈ బృహత్తర యజ్ఞంలో సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. దేశం కూడా అలానే ముందుకు సాగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్, డేటా కేంద్రాల ఏర్పాటు ద్వారా ఏపీ పేరు ప్రపంచ స్థాయిలో వినిపిస్తోందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates