వైసీపీ నుంచి బయటకు వచ్చి.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన వేణుంబాకం విజయసాయిరెడ్డి త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నారా? సరికొత్తగా ఆయన రాజకీయాలు ప్రారంభించనున్నారా? అంటే.. స్వయంగా ఆయనే ఔననే విధంగా కొన్ని లీకులు ఇచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ చేస్తున్న నేపథ్యంలో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఈడీ అధికారులుకూడా ఈ కేసును విచారిస్తున్నారు. తాజాగా సాయిరెడ్డి ఇంట్లో 13 గంటలపాటు సోదాలు చేప ట్టారు. అనంతరం.. అధికారులు వెళ్లిపోగా.. సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తన ఇంట్లో సోదాలు చేపట్టిన అధికారులకు ఏమీ లభించలేదన్నారు. దీనిని బట్టే తనకు మద్యం కేసులో ఎలాంటి పాత్రలేదన్నది స్పష్టం అవుతోందని చెప్పారు. మద్యం వ్యవహారంలో తాను కేవలం ప్రేక్షకుడినేనని ఆయన వ్యాఖ్యానించారు. పాత్ర ధారిని కాదని వ్యాఖ్యానించారు. అయినా.. అధికారులు తన ఇంట్లో సోదాలు చేపట్టారని వివరించారు.
ఈ క్రమంలో తాను జూలై నుంచి రాజకీయాల్లోకి వస్తున్నట్టు సాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. వాస్తవానికి గతంలో వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఆయన రాజకీయాల్లోకి వచ్చేది లేదని, తనకు వ్యవసాయం అంటే ఇష్టమని.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు.
ఈ క్రమంలో వ్యవసాయానికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా విడుదల చేశారు. తాజాగా మాత్రం తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. అంతేకాదు.. ఏపీలో కొత్త పార్టీ అవసరం ఉందని వ్యాఖ్యానించారు. “ఏపీలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉంది. ఆ సమయం కూడా వచ్చిందని భావిస్తున్నా“ అని అన్నారు.
సో.. దీనిని బట్టి సాయి రెడ్డి త్వరలోనే సొంత పార్టీ పెట్టనున్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో నిజంగానే ఆయన అనుకున్న విధంగా పార్టీ పెడితే.. ఏమేరకు ప్రభావం చూపుతారన్నది చూడాలి.
ఇదిలా వుంటే.. త్వరలోనే మీడియా రంగంలోకి కూడా సాయిరెడ్డి అడుగు పెడుతున్న విషయంతెలిసిందే. ఈ విషయాన్ని మరోసారి సాయిరెడ్డి ప్రస్తావించారు. మీడియా రంగంలోకి వస్తున్నానని చెప్పారు. ప్రజలే ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. మరోవైపు.. వైసీపీ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నాయకులు ఇప్పటకైనా బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates