కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారా?

తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ ఐక్య కార్యాచరణ సమితి (ఆర్టీసీ ఐకాస) సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మె గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలోనే స్పందించినా… ప్రధాన డిమాండ్లపై పెద్దగా స్పష్టత ఇవ్వకపోవడంతో ఆర్టీసీ సమ్మె మొదలైపోయింది.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే పెను నష్టమే సంభవించి తీరుతుందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ నేత, మల్కాజిగిరీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ సమ్మెపై సంచలన ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే… మాజీ సీఎం కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని ఆయన హెచ్చరించారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ ఐకాస నేతలు గురువారం ఎంపీ ఈటల రాజేందర్, బీసీ ఐకాస చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ లను కలిసి వినతి పత్రం అందజేశారు. తమ డిమాండ్లకు ఒప్పుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆర్టీసీ ఐకాస వారిని కోరింది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే… ఆర్టీసీకి మహార్దశ పడుతందని కార్మికులు భావించారు. ఆ దిశగానే నాటి టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలెక భూమిక పోషించారు. అయితే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక ఆర్టీసీ కార్మికుల ఆశలు అడియాశలే అయ్యాయి.

ఆర్టీసీపై గత బీఆర్ఎస్ సర్కారు దాదాపుగా ఉక్కుపాదం మోపిందనే చెప్పాలి. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే… మూడంటే మూడు రోజుల్లో విధుల్లో చేరాలని, లేదంటే వారి ఉద్యోగాలు ఊడినట్టేనని సీఎం హోదాలో కేసీఆర్ నాడు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే దిశగా కొన్ని కీలక ప్రకటనలు చేశారు. తాజాగా కాంగ్రెస్ హయాంలోనూ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారానికి నోచుకోలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఈటల…ఆసక్తికర కామెంట్లు చేశారు. 

ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని ఈటల అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ ను అమలు చేయాలన్న దిశగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదనలు చేసినా అవి అమలుకు నోచుకోలేదని ఆయన అన్నారు. సొంత రాష్ట్రంలో అయినా న్యాయం జరుగుతుందనుకుంటే… కార్మికులకు అన్యాయయమే జరుగుతోందన్నారు.

అయితే 2023 ఎన్నికలకు ముందు ఈ దిశగా నాటి బీఆర్ఎస్ సర్కారు యత్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇప్పటికీ ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికను నెరవేర్చడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర జేస్తే ఏం జరుగుతుందో కేసీఆర్ చవిచశారని.. ఇప్పుడు కేసీఆర్ బాటలో నడుస్తున్న కాంగ్రెస్ కు కూడా అదే తరహా పరిణామం స్వాగతం చెబుతుందని ఆయన వ్యాఖ్యానించారు.