త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు ఉన్న అట‌వీ ప్రాంతంలో ఒక‌ప్పుడు వీర‌ప్ప‌న్ ప్ర‌త్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్ర‌భుత్వాల‌ను సైతం గ‌డ‌గ‌డ‌లాడించిన ఆయ‌న‌ను ఎన్ కౌంట‌ర్‌లో పోలీసులు హ‌త‌మార్చారు. అయితే.. వీర‌ప్ప‌న్ పేరు త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంటుంది. ఆయ‌న కుమార్తె, భార్య కూడా.. త‌ర‌చుగా మీడియాలో క‌నిపిస్తూ ఉంటారు. తాజా ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ మొద‌టి భార్య ముత్తు ల‌క్ష్మి, ఆయ‌న కుమార్తె విద్యారాణిలు పోటీలో ఉన్నారు. అయితే ఇరువురు కూడా వేర్వేరు పార్టీల‌నుంచి పోటీ చేస్తుండ‌డం విశేషం.

వీర‌ప్ప‌న్ స‌తీమ‌ణి ముత్తు ల‌క్ష్మి.. త‌మిళ‌గ వ‌ఘ‌రిమై క‌ట్చి(టీవీకే) పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నారు. కృష్ణ గిరి జిల్లోని కృష్ణ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె బ‌ల‌మైన పోటీ ఇస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక‌, వీర‌ప్ప‌న్ వార‌సురాలిగా రంగంలోకి దిగిన ఆయ‌న పెద్ద కుమార్తె.. విద్యారాణి.. నామ్ త‌మిళ‌ర్ క‌ట్చి(ఎన్‌టీకే) పార్టీ త‌ర‌ఫున బ‌రిలో దిగారు. ఈమె.. మెట్టూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్ద‌రికీ కూడా గ‌త ప‌దేళ్లుగా బ‌ల‌మైన రాజ‌కీయ అనుభ‌వం ఉండ‌డంతోపాటు.. వీర‌ప్ప‌న్ సానుభూతి ప‌రుల ఆశీర్వాదం కూడా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

వీరిద్ద‌రూ వేర్వేరు పార్టీల త‌ర‌ఫున పోటీ చేస్తున్నా.. త‌ల్లీకూతుళ్లుగా.. ఇద్దరూ కూడా త‌మ కులంతోపాటు.. వీర‌ప్ప‌న్ ఫొటోను వాడేసుకుంటున్నారు. వన్నియ‌ర్ సామాజిక వ‌ర్గానికి చెందిన వీర‌ప్ప‌న్‌కు ఆ కులంలో మంచి సానుభూతి ఉంది. దీనిని వీరు త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. అంతేకాదు.. వీర‌ప్ప‌న్ త‌మిళ‌నాడు కోసం.. ప్రాణాలు అర్పించారని.. త‌మిళ‌నాడు అడ‌వీ సంప‌ద‌ను ఆయ‌న ప‌రిర‌క్షించార‌ని కూడా చెబుతున్నారు. ఇక‌, ఇద్ద‌రూ మ‌హిళ‌లు కావ‌డం.. వీరి ప్ర‌చారానికి స్వ‌చ్ఛందంగా వ‌న్నియ‌ర్ కులానికి చెందిన యువ‌త పెద్ద ఎత్తున త‌ర‌లి రావ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలోనే స‌త్తా..

గ‌త ఎన్నిక‌ల్లోనే వీర‌ప్ప‌న్ కుమార్తె.. విద్యారాణి బ‌ల‌మైన ప్ర‌భావం చూపించార‌న్న‌ది వాస్త‌వం. అప్ప‌ట్లో ఆమె కృష్ణ‌గిరి నియోజ క‌వ‌ర్గంలో పోటీ చేసి.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రెండో స్థానం ద‌క్కించుకున్నారు. క‌వేలం 2 వేల ఓట్ల తేడాతోనే అప్ప‌ట్లో ఓడిపోయారు. ఇప్పుడు ఆ స్థానంలో వీర‌ప్ప‌న్ మొద‌టి భార్య ముత్తు ల‌క్ష్మి పోటీ చేస్తున్నారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌ర్వేల్లో వీరిద్దరూ విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఇదే జ‌రిగితే.. అసెంబ్లీలో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ అడుగు పెట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.