అంబ‌టి దీక్ష‌… మద్దతు శూన్యం!

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి.. త‌ర‌చుగా కూట‌మి స‌ర్కారు స‌హా.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే అంబ‌టి రాంబాబు.. తాజాగా 12 గంటల నిరాహార దీక్ష చేప‌ట్టారు. గుంటూరు జిల్లాలోని త‌న నివాసంలోనే చేప‌ట్టిన ఈ దీక్ష‌.. ఆయ‌న‌కు ఉన్న మ‌ద్ద‌తు ఎంతో స్ప‌ష్టం చేసింద‌ని.. టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. స‌హ‌జంగా ఇలాంటి దీక్ష‌లు చేప‌ట్టినప్పుడు క‌నీసంలో క‌నీసం 100 మంది నాయ‌కులు అయినా.. అంబటి వెంట ఉండాలి. కానీ.. ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా క‌నిపించ‌లేద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

ఇదిలావుంటే.. నిరాహార దీక్ష‌ను ప్రారంభించిన త‌ర్వాత అంబ‌టి మాట్లాడుతూ.. నారా లోకేష్‌, సీఎం చంద్ర‌బాబుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అదేస‌మ‌యంలో పోలీసుల‌పైనా ఆయ‌న నిప్పులు చెరిగారు. పోలీసులు టీడీపీ జెండాలు క‌ట్టుకుని తిరగాల‌ని వ్యాఖ్యానించారు. త‌న‌ను 18 రోజులు జైల్లో ఉంచార‌ని.. కానీ.. త‌న ఇంటిపైనా.. త‌ను ప్ర‌యాణిస్తున్న కారుపైనా దాడికి పాల్ప‌డిన వారిని క‌నీసం 18 నిమిషాలైనా స్టేష‌న్‌కు పిలిచారా? అని ప్ర‌శ్నించారు. ఇలాంటి వారిని వ‌దిలి పెట్టేది లేద‌న్నారు.

ఎందుకీ దీక్ష‌..?

గతంలో తిరుమ‌ల లడ్డూ వ్య‌వ‌హారం వివాదం జ‌రుగుతున్న స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబుకు మంచి బుద్ధి ప్ర‌సాదించాల‌ని కోరుతూ.. వైసీపీ నాయ‌కులు.. ఆల‌యాల్లో పూజ‌లు చేశారు. ఈ క్ర‌మంలో అంబ‌టి కారును కొంద‌రు అడ్డ‌గించ‌డంతో ఆయ‌న చంద్ర‌బాబు మాతృమూర్తిపై విమ‌ర్శలు చేశారు. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న ఇంటికిచేరుకున్న టీడీపీ శ్రేణులు.. నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలో అంబ‌టిని పోలీసులు అరెస్టు చేయ‌డం.. ఆయ‌న‌ను జైల్లో ఉంచ‌డం తెలిసిందే.

అయితే.. పోలీసులు త‌న‌ను అరెస్టు చేసిన‌ప్పుడు.. న‌ల్ల‌పాడు పోలీసు స్టేష‌న్‌లో  ఆయ‌న‌ను శారీర‌కంగా హించార‌న్న‌ది అంబ‌టి ఆరోప‌ణ‌. ఈ క్ర‌మంలోనే తన ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడికి నిరసన వ్య‌క్తం చేస్తూనే.. నాటిఘ‌ట‌న‌లో నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తోపాటు.. త‌న‌ను వేధించిన‌ పోలీసుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న డిమాండ్‌తో  అంబటి ఈ దీక్ష‌కు దిగారు. ఉద‌యం 6 నుంచి సాయంత్రం 6 వ‌ర‌కు 12 గంట‌ల పాటు ఈ దీక్ష నిర్వ‌హిస్తాన‌ని.. ఆయ‌న ప్ర‌క‌టించ‌డం విశేషం.