టీడీపీ రాష్ట్ర, జాతీయ కమిటీలను తాజాగా ప్రకటించారు. వీటిలో మెజారిటీ పదవులను యువతకు కేటా యించారు. దీనినే పార్టీలో కొందరు `లోకేష్ టీం`గా పేర్కొంటున్నారు. వీరంతా కూడా లోకేష్తో అనుబంధం ఉన్నవారే కావడం గమనార్హం. మంచిదే.. పార్టీలో అధినేత మొదలు ఎవరో ఒకరితో అనుబంధం ఉండడం తప్పుకాదు. కానీ.. తాజాగా ఎంపికైన పదవులను గమనిస్తే.. కీలకంగా ఉన్న యువ నాయకులకు భారీ బరువు బాధ్యతలే కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా 3 రూపాల్లో ప్రస్తుతం ఏర్పడిన యువ నాయకత్వానికి బాధ్యతలు పెరగనున్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. 1) వచ్చే ఎన్నికల్లో పార్టీని మరోసారి విజయ తీరాలకు చేర్చడం: దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ తరఫున సరైన ప్రణాళికను ఇచ్చేశారు. ప్రజలతో మమేకం కావడం.. ప్రజల సమ్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించడం కీలకం.
2) యువతను పార్టీవైపు ఆకర్షించడం: ప్రస్తుతం యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్న పార్టీలో మరింత మంది యువతకు ప్రాధాన్యం పెంచనున్నారు. ఈ బాధ్యతలను కొత్త కమిటీలే తీసుకుంటాయి. అంతేకాదు.. హుషారుగా కూడా పనిచేయనున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బూత్ స్థాయి నుంచి అన్ని స్థాయిల్లోనూ యువతకు ప్రాధాన్యం పెరగనుంది.
3) కలివిడి: పార్టీలో ప్రస్తుతం యువ నాయకులకు-సీనియర్లకు మధ్య కలివిడి లోపించింది. దీనిని సరిదిద్దేందుకు ప్రస్తుతం ఏర్పడిన కమిటీలు కృషి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సలహాలు.. సూచనలు వంటి విషయాలతో పాటు నియోజకవర్గాల్లో పర్యటనలు వంటివి కూడా యువ నాయకత్వమే చూసుకోవాలి. మొత్తంగా రాష్ట్రంలో యువతను కేంద్రంగా చేసుకుని ఈ కమిటీలు పార్టీని డెవలప్ చేయడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాల్సిన అతి పెద్ద బాధ్యతను పెట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates