వీగిన మ‌హిళా బిల్లు.. ఎందుకిలా? ఏం జ‌రిగింది?

Glimpses of the new Parliament Building, in New Delhi

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన మూడు రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లులు లోక్‌స‌భ‌లో వీగిపోయాయి. వీటిలో ప్ర‌ధాన మైంది.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు. వాస్త‌వానికి 2023లో చ‌ట్టం అయిన‌.. దీనిని మ‌రోసారి స‌వరించ‌డం ద్వారా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను కేంద్రం ప్ర‌తిపాదించింది. ఇదే ఇప్పుడు ఈబిల్లు వీగిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. దీనికి మ‌రో కీల‌క కార‌ణం.. `రాజ‌కీయం`. ఎన్నిక‌ల వేళ మోడీ స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా దీనిని తీసుకువ‌చ్చింద‌న్న ప్ర‌తిప‌క్షాలు.. అన్నంత ప‌నీచేశాయి.

ముఖ్యంగా..

ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు వంటి పెద్ద‌రాష్ట్రాల ఎన్నిక‌లు ఈ నెల 23న జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌హిళ‌లకు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించామ‌న్న వాద‌న‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని.. స‌ర్కారు యోచ‌న చేసింద‌న్న‌ది ప్ర‌తిప‌క్షాల ఆరోపణ‌. దీనికితోడు.. 2023లోనే చ‌ట్టం అయిపోయిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ ను ఎందుకు స‌వ‌రించాల్సి వ‌చ్చింద‌న్న ప్ర‌శ్న‌కు కూడా కేంద్రం వ‌ద్ద జ‌వాబు లేకుండా పోయింది. కేవ‌లం డీలిమిటేష‌న్‌ను చేయాల‌న్న ఉద్దేశంతో దీనిని స‌వ‌రిస్తున్నార‌ని పేర్కొన్న ప్ర‌తిప‌క్షాల‌ను కేంద్రం.. ఒప్పించ‌లేక పోవ‌డం మ‌రో రీజ‌న్‌.

రాజ‌కీయ‌మే..

మ‌హిళా చ‌ట్టం -2023ను అమ‌లు చేస్తున్న‌ట్టు ఒక‌వైపు నోటిఫికేష‌న్ ఇచ్చేసిన కేంద్రం(గురువారం అర్ధ‌రాత్రి ఇచ్చారు).. ఆ వెంట‌నే దీనిని స‌వ‌రించేందుకు లోక్‌స‌భ‌లో బిల్లు పెట్టి చ‌ర్చించ‌డాన్ని కాంగ్రెస్ స‌హా అన్ని ప‌క్షాలు వ్య‌తిరేకించాయి. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాల‌కు.. బీజేపీ అనుకూల రాష్ట్రాల‌కు మేలు జ‌రిగేలా డీలిమిటేష‌న్‌ను చేప‌ట్టార‌న్న వాద‌న‌ను కేంద్రం వ్య‌తిరేకించే ప్ర‌య‌త్నం చేసినా.. ఫ‌లించ‌లేదు. దీంతో ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా దుయ్య‌బ‌ట్టాయి. అదేస‌మ‌యంలో ఓటింగ్‌కు కూడా వ్య‌తిరేకంగా నిలిచాయి.

ద‌క్షిణాది పూర్తిగా వ్య‌తిరేకం..

ద‌క్షిణాది రాష్ట్రాల్లో కీల‌క‌మైన డీలిమిటేష‌న్‌పై సంపూర్ణ వ్య‌తిరేక‌త క‌నిపించింది. ఈ విష‌యంలో టీడీపీ(మిత్ర‌ప‌క్షం) కూడా స‌భ‌లో చూచాయ‌గా ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించింది. ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు శుక్ర‌వారం పార్ల‌మెంటులో మాట్లాడుతూ.. 2011 జ‌నాభా లెక్క‌లు ఎందుకు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నార‌న్న‌దే త‌మ అభ్యంత‌ర‌మ‌ని పేర్కొన్నారు.

కానీ.. బిల్లుల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌న్నారు. ఇక‌, తెలంగాణ కాంగ్రెస్‌, త‌మిళ‌నాడు అన్ని ప‌క్షాలు, క‌ర్ణాట‌క కాంగ్రెస్ స‌హా.. స్థానిక పార్టీల నాయ‌కులు కూడా దీనిని వ్య‌తిరేకించారు. మొత్తంగా మూడు కార‌ణాల‌తో ఈ బిల్లులు వీగిపోయాయి.

1) డీలిమిటేష‌న్‌కు-మ‌హిళాబిల్లుకు లింకు పెట్ట‌డం.

2) రెండు కీల‌క రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ముందు ఈ బిల్లులు తీసుకురావ‌డం.

3) మ‌హిళా రిజ‌ర్వేష‌న్ చ‌ట్టం 2023 అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించాక‌.. స‌వ‌ర‌ణ చేయ‌డం.