ఏపీలో `తల్లికి వందనం` పేరుతో పిల్లలను స్కూళ్లకు పంపించే తల్లుల ఖాతాల్లో రూ.15000 జమ చేసే పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే పథకాన్ని తమిళనాడులోనూ అమలు చేయనున్నట్టు తమిళ వెట్రి కగళం(టీవీకే)పార్టీ చీఫ్, దళపతి విజయ్ ప్రకటించారు. “అమ్మా వణక్కం` పేరుతో ఆయన ఈ కీలక పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద.. ప్రభుత్వ స్కూళ్లకు తమ పిల్లలను పంపించే తల్లుల ఖాతాల్లో 15 వేల రూపాయలను జమ చేస్తామని హామీ ఇచ్చారు.
దీంతో పాటు పలు కీలక హామీలతో గురువారం సాయంత్రం విజయ్ సంచలన మేనిఫెస్టో విడుదల చేశా రు. మరో వారం రోజుల్లో(ఈ నెల 23న) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో విజయ్ విడుదల చేసిన మేనిఫెస్టో.. అనేక సంచనాలకు వేదికగా మారింది. ప్రధానంగా అమ్మ వణక్కంతో పాటు.. ప్రతి ఇంటికీ ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇవ్వనున్నట్టు సంచలన హామీ ఇచ్చారు. ఇదికూడా తీవ్రంగా ప్రభావితం చేయవచ్చనని పరిశీలకులు చెబుతున్నారు.
వీటితోపాటు.. 60 ఏళ్ల వయసులోపు మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. దీనికి సామాజిక భద్రతా పింఛనుకు సంబంధం లేదని తెలపడం గమనార్హం. వాస్తవానికి సామాజిక భద్రతా పింఛను 60 ఏళ్లు నిండిన వారికి వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో 18 ఏళ్లు నిండి.. 60 ఏళ్ల లోపు ఉన్న అందరు మహిళలకు 2500 చొప్పున ప్రతినెలా ఇస్తామని చెప్పడం విశేషం.
కీలకం రుణ మాఫీ..
ఇక, విజయ్ ఇచ్చిన మరో సంచలన హామీ.. రుణ మాఫీ. ఇది 5 ఎకరాల లోపు ఉన్నఅన్నదాతలు అందరి కీ వర్తిస్తుందని చెప్పారు. కౌలు రైతులకు కూడా దీనిని వర్తింప చేస్తామని చెప్పడం గమనార్హం. డిగ్రీ చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి నెలకు 4 వేల రూపాయల భృతిని అందిస్తామన్నారు. దివ్యాంగు లకు.. వితంతువులు, ఒంటరి మహిళలకు నెల నెలా ఇస్తున్న పింఛనును రూ.3000లకు పెంచుతామ న్నారు. బీసీల నుంచి ఎస్సీ,ఎస్టీల వరకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందిస్తామన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates