సభలో ప్రవేశ పెట్టే 3 బిల్లులు ఇవే… ఏ కూటమికి ఎంత బలం?

భారతదేశ చరిత్రలో ఈ రోజు (గురువారం, ఏప్రిల్ 16)కు ఒక ప్రత్యేకత ఉండనుంది. సుదీర్ఘ విరామం తర్వాత లోక్ సభ స్థానాల పెంపునకు సంబంధించిన బిల్లుతో పాటు.. మహిళా రిజర్వేషన్ల అమలును మరింత ముందుకుతీసుకెళ్లే కీలక బిల్లును సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లతో ముందుకు వెళ్లాలని మోడీ సర్కారు భావిస్తోంది. అదే సమయంలో లోక్ సభలో స్థానాల పెంపుతోనే 2029 ఎన్నికలు జరగాలన్న పట్టుతో మోడీ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మూడు కీలక బిల్లులు సభలో ప్రవేశ పెట్టనున్నారు. నిజానికి ఈ మూడు బిల్లుల మీద చర్చ కోసమే పార్లమెంటు ప్రత్యేకంగా భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.

మూడు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో ఈ మూడు అంశాలకు సంబంధించి ఒక్కో సభలో 18 గంటల పాటు (లోక్ సభ, రాజ్యసభ) చర్చకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మూడు బిల్లుల్లో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు కాగా.. మిగిలిన రెండు చట్టపరమైన బిల్లులు. ఇంతకూ ఈ మూడు బిల్లుల్లో ఏది రాజ్యాంగ సవరణ బిల్లు? దానికి ఎంత మెజార్టీ అవసరం. సభలో ఏ కూటమికి ఎంతమంది సభ్యుల బలం ఉంది?అన్న వివరాల్లోకి వెళితే..ఆసక్తికరఅంశాలు వెలుగు చూస్తాయి.

 మూడు బిల్లులు ఏంటి?

1. ఇప్పటివరకు లోక్ సభ సీట్లను 550 గరిష్ఠంగా ఉన్న దానికి బదులుగా 850కు పెంచేయటం..2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.

2. లోక్ సభ.. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటునకు సంబంధించిన మరో బిల్లు.

3. కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే బిల్లు.

రాజ్యాంగ సవరణ బిల్లు వర్సెస్ చట్టపరమైన బిల్లు

బిల్లుల్లో రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు.. చట్టపరమైన బిల్లుకు మధ్య వ్యత్యాసం పెద్ద ఎత్తున ఉంటుంది. చట్టపరమైన బిల్లుల ఆమోదానికి ఉభయ సభల్లో సాధారణ మెజార్టీ సరిపోతుంది.కానీ..రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో అలా కుదరదు. కచ్ఛితంగా మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి. డీలిమిటేసన్ ను వ్యతిరేకిస్తామని ఇండియా కూటమి చెబుతుండటంతో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. ఎందుకంటే.. కేంద్రంలోని ఎన్డీయే కూటమి మొత్తం సభ్యుల సంఖ్య మూడింట రెండు వంతులు కాకపోవటమే.

మరింత వివరంగా అంకెల్లో మాట్లాడుకుంటే ప్రస్తుతం లోక్ సభలో 540 మంది సభ్యుల్లో 2/3 మెజార్టీతో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదం పొందాలంటే.. 360 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం అధికార ఎన్డీయే కూటమికి 292 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. ఈ లెక్కన మరో 68 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే.. ఇక్కడే మరో కిటుకు ఉంది. సభకు హాజరైన సభ్యుల్లో 2/3వ వంతు మెజార్టీ సాధిస్తే సరిపోతుంది. ఈ లెక్కన చూస్తే.. డీలిమిటేషన్ బిల్లు ఒకవేళ జనాభా ప్రాతిపదికన చేపడితే లాభ పడేరాష్ట్రాల జాబితాలో ముందు ఉండేది ఉత్తరప్రదేశ్. అదే విధంగా పశ్చిమబెంగాల్ కూడా.

ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎన్డీయే కూటమి కాకుండా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ఉన్న మెజార్టీ చూసినప్పుడు సమాజ్ వాదీ పార్టీకి 37 మంది సభ్యులు ఉన్నారు. అదే సమయంలో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీకి 28 మంది ఉన్నారు. తాజా బిల్లు జనాభా ప్రాతిపదికన ప్రవేశ పెడితే అత్యధికంగా లాభపడే రాష్ట్రాలుగా ఉండి కూడా..కేంద్రం బిల్లును వ్యతిరేకిస్తే.. ఆయా పార్టీలకు భారీగా నష్టం వాటిల్లుతుంది. ఆ పనిని ఆ పార్టీలు చేయలేవు. అదే సమయంలో కూటమి ధర్మాన్ని పాటించకున్నా నష్టమే.

ఇందుకు మధ్యే మార్గాన్ని అనుసరిస్తే సరిపోతుంది. అంటే.. ఈ రెండు పార్టీల సభ్యులను కలిపితే.. 65 మంది సభ్యులు అవుతారు. మోడీ సర్కారుకు అవసరమైన 68 మంది ఎంపీల్లో ఈ రెండు పార్టీల 65 సభ్యులు అత్యంత కీలకం. ఇలాంి వేళ.. ఓవైపు కూటమి ధర్మాన్ని పాటిస్తూ.. కేంద్రం ప్రవేశ పెట్టే బిల్లును వ్యతిరేకిస్తూనే.. మరోవైపు ఓటింగ్ సమయంలో సభకు గైర్హాజరు అయితే.. ఎన్డీయే కూటమి సునాయాసంగా బయటపడిపోతుంది. తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అయిపోతుంది.

లోక్ సభలో అధికార ఎన్డీయే కూటమి.. ప్రతిపక్షం ఇండియా కూటమి సభ్యుల్ని చూస్తే.. ఎన్డీయే కూటమిలో మొత్తం 14 పార్టీలతో కలిసి 292 మంది సభ్యులు ఉంటే.. ప్రతిపక్ష ఇండియా కూటమిలో 21పార్టీలతో కలిపి 233 మంది సభ్యులు ఉన్నారు. ఈ రెండు కూటములకు సమాన దూరాన్ని పాటిస్తున్న ఇతరుల జాబితాలో ఇండిపెండెంట్లు 7, వైసీపీ 4, ఏఎస్ పీ కాన్షీరాం, శిరోమణి అకాళీదళ్, జడ్ పీఎం, యూపీపీఎల్ పార్టీలకు ఒక్కో సభ్యుడు చొప్పున ఉన్నారు. అంటే.. ఇతరుల జాబితాలోని ఆరు పార్టీలకు 15 మంది సభ్యులు ఉన్నారు.

అధికార ఎన్డీయే.. విపక్ష ఇండియా కూటమిలో అత్యధిక స్థానాలు టాప్ 5లో ఉన్న పార్టీల సభ్యులే ఎక్కువ. ఎన్డీయే కూటమిలోని 292 మంది సభ్యుల్లో టాప్ 5 పార్టీల సభ్యులు.. ఇండియా కూటమిలోనూ చూస్తే విషయం ఇట్టే అర్థమవుతుంది.

అధికార ఎన్డీయే కూటమి – టాప్ 5 పార్టీల సభ్యుల సంఖ్య

1. బీజేపీ 240

2. టీడీపీ 16

3. జేడీయూ 12

4. శివసేన 7

5. ఎల్ జేపీ 5

మొత్తం సభ్యులు 292లో టాప్ 5 పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్య 280

విపక్ష ఇండియా కూటమి – టాప్ 5 పార్టీ సభ్యుల సంఖ్య

1. కాంగ్రెస్ 98

2. ఎస్ పీ 37

3. టీఎంసీ 28

4. డీఎంకే 22

5. శివసేన 9

మొత్తం సభ్యులు 233లో టాప్ 5 పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్య 194.