బిల్లు బీజేపీది అయితే వైసీపీ మద్దతు ఉండదా

బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే…బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ…తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా ఓకే చెప్పేసింది. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు సరైన దిశలోనే వెళుతోందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త హోదాలో ఉన్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ప్రకటన ఇచ్చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో బీజేపీ ప్రభుత్వం సరైన దిశలోనే వెళుతోందని సజ్జల చెబుతున్నారంటే…బీజేపీ ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించినట్టే కదా.

బీజేపీని వైసీపీ అధినేత మతతత్వ పార్టీగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. బీజేపీ లాంటి మతతత్వ పార్టీలతో తాము పెట్టుకోబోమని కూడా జగన్ ప్రకటించారు. అయితే ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో…అప్పటి నుంచి బీజేపీ చెప్పిన మాటను వైసీపీ దాటనే లేదని చెప్పక తప్పదు. ఉమ్మడి పౌరస్మృతి అయినా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక అయినా.. పార్లమెంటులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును వైసీపీ బలపరుస్తూనే సాగుతోంది. తాజాగా నియోజకవర్గాల పునర్విభజనను కూడా వైసీపీ బలపరచిరనట్టేనని చెప్పక తప్పదు.

వాస్తవానికి నియోజకవర్గాల పునర్వభజనకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసేలా ఎన్డీఏ సర్కారు వ్వవహరిస్తోందన్న వాదనలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ దిశగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇప్పటికే దక్షిణాది పార్టీలకు చెందిన నేతలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి అటు అధికార కాంగ్రెస్ తో పాటు ఇటు విపక్ష బీఆర్ఎస్ కూడా హాజరైంది. ఈ భేటీకి జగన్ దూరంగా ఉండిపోయారు. దీంతో బీజేపీ చేస్తున్న నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు ఎంతగా నష్టం చేసినా… తాము మాత్రం బీజేపీతోనే సాగుతామని వైసీపీ ప్రకటించినట్టైంది.

తాజాగా అదే మాటను సజ్జల బహిరంగంగానే ప్రకటించారు. బుధవారం మీడియా ముందుకు వచ్చిన సజ్జల… నియోజకవర్గాల పునర్విభజనపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ప్రతి రాష్ట్రంలో 55 శాతం సీట్లను పెంచే దిశగా ఎన్డీఏ సర్కారు డీలిమిటేషన్ ను చేస్తోందని చెప్పిన సజ్జల… అదే జరిగితే ఇక ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు కదా అని అన్నారు.

అంతేకాకుండా జనాబా లెక్కల ఆధారంగా చేసే పునర్విభజనతో జరిగే నష్టాన్ని కూడా ఎన్డీఏ సర్కారు పరిష్కరించేసినట్టే కదా అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా నియోజకవర్గాఅ పునర్విభజనలో బీజేపీకి వైసీపీ మద్దతు ఖాయమని ఆయన చెప్పినట్టైందన్న విశ్లేషణలు సాగతున్నాయి.