జోష్ తగ్గింది జగన్

వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొంటారు. కానీ తాజాగా నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటనకు ఈ స్థాయిలో ఈ దఫా నాయకులు గాని కార్యకర్తలు గాని కనిపించలేదు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత పలు సందర్భాల్లో జగన్ బయటకు వచ్చారు. పరామర్శ యాత్రలు చేశారు.

ఆయా సందర్భాల్లో కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో ఆయన వెంట రావడం తెలిసిందే. వీటిని వైసిపి అనుకూల మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఈసారి ఎందుకో జోష్ తగ్గింది. దీని వెనక బలమైన రెండు కారణాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకటి రాజధాని అమరావతికి ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చిన మావిగన్ ప్రకటన పట్ల పార్టీలోనే తీవ్ర అసంతృప్తి ఉండడం. రెండు నెల్లూరు పార్టీలో నాయకుల మధ్య కలివిడితనం లేకపోవడంతో పాటు ఎవరికి వారుగా రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా జ‌గ‌న్‌కు ఇప్పుడు దూరం పాటిస్తోంది. ఫలితంగా నెల్లూరులో నిర్వహించిన జువ్వలదిన్నె పర్యటన బోసిపోయిందనే చెప్పాలి. నిజానికి జగన్ పర్యటనలకు ఆయన సొంత మీడియా భారీ స్థాయిలో కవరేజ్ ఇస్తుంది. భారీ ఎత్తున జనాలు వచ్చారని కూడా పెద్ద ఎత్తున చూపించే ప్రయత్నం చేస్తుంది. తాజా పర్యటనకు సంబంధించి అటువంటి ప్రకటనలు కానీ అటువంటి వీడియోలు కానీ ఎక్కడా రాకపోవడం విశేషం.

అంతే కాదు నాయకులు కూడా సీనియర్లు ఎవరు లేకపోవడం.. ప్రస్తావనార్హం. స్థానికంగా నెల్లూరు జిల్లాలో అనేకమంది నాయకులు ఉన్నారు. వారు ఎవరు తాజా పర్యటన‌లో పెద్ద‌గా కనిపించలేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన మాజీమంత్రి అప్పలరాజు వంటి ఒకరిద్ద‌రు నాయకులు కనిపించినా స్థానిక నాయకులు మాత్రం జగన్ పర్యటనకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.