వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టిందని.. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా దినసరి కూలీలు, డ్రైవర్లు, హాకర్లు, చిరు వ్యాపారులు, పేదలు ఎంతో లబ్ధి పొందారని అన్నారు. వైసీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత.. పేదలకు పెట్టే అన్నాన్ని కూడా జగన్ తీసేశాడని విమర్శించారు. “నేను చేసిన నేరం ఏంటి. పేదలకు 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టడం. దీనిని కూడా సహించలేక పోయాడు.“ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ కడుపు మంటే..
పేదల కడుపు మంటే వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజలకు మేలు చేయకపోగా.. వారికి కడుపునిండా అన్నం పెట్టే కార్యక్రమాన్ని కూడా తీసేశాడని దుయ్యబట్టారు. “అప్పట్లో మావాళ్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. పేదలపై కోపం వద్దని చెప్పాం. కానీ.. మా మాట వినలేదు. పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లపై కూడా అక్కసుగా వ్యవహరించారు. మేం అలా చేయలేదు. పేదల కోసం గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను మరింతగా అమలు చేస్తున్నారు. తల్లికి వందనం పేరుతో నిధులు ప్రతి ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా ఇస్తున్నాం.“ అని వివరించారు.
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరో 62 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం.. అన్న క్యాంటీన్ కు వచ్చిన పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. తాను కూడా.. 5 రూపాయల టోకెన్ తీసుకుని.. పేదలతో కలిసి వారితోనే భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు..2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 207 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్న సీఎం.. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 అన్న కాంటీన్లను ప్రారంభించామని చెప్పారు.
మొత్తంగా రాష్ట్రంలో 269 అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చుతున్నామని చంద్రబాబు తెలిపారు. త్వరలో మరో 5 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. గడచిన 21 నెలల్లో 8.80 కోట్ల భోజనాలను పేదలకు అందించామన్నారు. ప్రతీ రోజూ ఒక్కొక్క అన్న క్యాంటీన్ లో సగటున 1,013 మందికి భోజన సదుపాయం అందుబాటులో ఉందని.. తద్వారా.. పేదల ఆకలి తీర్చుతున్న ప్రభుత్వం ఇదేనని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో పేదలకు భోజన వసతి కోసం 243 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ క్యాంటీన్లను ప్రారంభించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
