ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.. రిటైరయ్యారు. దీంతో కొత్త కమిషనర్ను ఎంపిక చేసే బాధ్యతను సీఎం చంద్రబాబు తీసుకున్నారు. ఈ క్రమంలో పలువురి పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. తాజాగా అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. మాజీ ప్రధాన కార్యదర్శులు.. ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
వీరిలోనూ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని సమాచారం. వైసీపీ హయాంలో అత్యంత అవమానకర రీతిలో ఆయనను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. కనీసం.. ఆయన నుంచి సంజాయిషీ కూడా కోరకుండానే.. అప్పటి ముఖ్యమంత్రి జగన్.. ఎల్వీని కీలక పదవి నుంచి తప్పించి డిమోషన్ ఇచ్చారు. దీంతో ఆయన రిటైర్మెంట్ వరకు వేచి ఉండి.. పదవీ విరమణ చేశారు. అలా అత్యంత అవమానకర రీతిలో ఎల్వీ పదవిని కోల్పోయారు.
ఇప్పుడు ఆయనను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ను చేయడం ద్వారా జగన్కు తగిన విధంగా బుద్ధి చెప్పినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదేసమయంలో ఐఏఎస్ అధికారుల ఉన్నతికి, వారి గౌరవానికి తమ ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందన్నది చెప్పకనే చెప్పినట్టు అవుతుందని కూడా బాబు భావిస్తున్నట్టు సమాచారం. ఇదిలావుంటే.. మరోవైపు సీనియర్ అదికారి.. వివాదరహితుడు.. నీరబ్ కుమార్ ప్రసాద్ పేరునుకూడా బాబు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
కానీ.. రాజకీయంగా.. అటు వైసీపీ పరంగా చూసుకుంటే.. ఎల్వీనే ఈ పదవికి సరైన అధికారిగా భావిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పైగా.. నిబద్ధతకు మారు పేరుగా కూడా ఎల్వీ పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఎల్వీ వైపే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని.. ఏదైనా కాదని అనుకుంటే.. నీరబ్కుమార్కు ఛాన్స్ దక్కుతుందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates