ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత 2014 -19 మధ్య జరిగిన పొరపాట్లను, జరిగిన ఆలస్యాన్ని ఇప్పుడు పూర్తిగా నివారించి రాజధాని నిర్మాణాలను వడివడిగా పూర్తి చేయడం ద్వారా వైసీపీకి అవకాశం ఇవ్వకూడదనే ధోరణితో వ్యవహరిస్తోంది. ఫలితంగా రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి.
ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా పనులను సమీక్షిస్తున్నారు. వేగాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుంటున్నారు. నిధులకు లోటు లేకుండా ఎప్పటికప్పుడు నిర్మాణ రంగ సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. తద్వారా 2028 నాటికి అంటే 2029 ఎన్నికలకు దాదాపు 6- 7 మాసాలకు ముందే రాజధాని అమరావతి పనులను 30 నుంచి 40 శాతం వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అంటే ఒక రకంగా రాజధాని నిర్మాణ పనులు వడవడిగా సాగుతున్నాయి. ఇది `ఆగదు` అనేది స్పష్టం అవుతుంది. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్ మాత్రం తన రాజకీయాలను కొనసాగిస్తున్నారు. తాజాగా మావిగన్ పేరుతో ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ప్రజల్లోనూ ఆసక్తిగా మారింది. అయితే, గతంలో మూడు రాజధానుల ప్రకటన చేశారు ఇది సాకారం కాక పోగా జగన్ ట్రోల్ అయ్యారు. పైగా రాజధాని రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది.
దేశవ్యాప్తంగా చర్చ కూడా నడిచింది. అలాంటి పరిస్థితిలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాలను వడివడిగా పూర్తి చేసేందుకు నిర్ణయించుకుని అదే దిశలో ముందుకు సాగుతోంది. ఈ విషయం తెలిసి కూడా జగన్ మావిగన్ ప్రకటన చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్నది పరిశీలకులు చెబుతున్న మాట. తద్వారా అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలను తనకు అనుకూలంగా మార్చుకునేలా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
అదేసమయంలో కేవలం ఒక్క ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.. మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని ప్రజల్లో చర్చ పెట్టాలన్న ఉద్దేశంతోనూ జగన్ వ్యవహరిస్తున్నారన్నది స్పష్టం అవుతోందని అంటున్నారు. నిజానికి ఉత్తరాంధ్రలోనూ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలకు, సినీ రంగానికి కూడా ప్రాధాన్యమిస్తోంది. ఇక విజయనగరం జిల్లా భోగాపురంలో త్వరలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది.
ఇటు కర్నూలు, అనంతపురం, కడప వంటి సీమ జిల్లాల్లో కూడా రైతులను ప్రోత్సహించడంతోపాటు పెట్టుబడి పెట్టే వారికి రాయలసీమ జిల్లాలను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. అంటే ఒక రకంగా అమరావతి డెవలప్ అవుతున్నప్పటికీ ఇతర ప్రాంతాలను కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. కానీ, ఈ విషయాన్ని మరుగు పరుస్తున్న జగన్.. అమరావతి ఆగదని తెలిసి కూడా మావిగన్ పేరుతో మూడు ప్రాంతాల రాజకీయాలను ప్రభావితం చేసేలాగా వ్యవహరిస్తున్నారన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట.
ఇదే సమయంలో చంద్రబాబు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు అన్నది చర్చకు రావాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ, రాజధానిపై అవగాహన ఉన్న మేధావులు, సాధారణ ప్రజలు కూడా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాన్ని కానీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను గాని ఎక్కడా వ్యతిరేకించకపోవడం గమనార్హం. అంతేకాదు జగన్ ప్రకటించిన మావిగన్కు ఇంతవరకు ఎవరు సపోర్ట్ చేయకపోవడం కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates