షాకింగ్: గుడివాడ అమర్నాథ్ కు జైలు శిక్ష

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ విశాఖపట్నం రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 2016 ఏప్రిల్‌లో విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులో ఈ తీర్పు వచ్చింది.

అప్పట్లో నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి వరలక్ష్మి శిక్షను ఖరారు చేశారు.

కోర్టు తీర్పుతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా అమర్నాథ్ స్పందిస్తూ దిగువ న్యాయస్థానం తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌కు వెళ్తానని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కోసం తాను చేసిన పోరాటమే ఫలించి ప్రస్తుతం జోన్ సాధ్యమైందని పేర్కొన్నారు. న్యాయపరంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.