బొత్స సత్యనారాయణ. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు. ఒకప్పుడు విజయనగరం నుంచి విశాఖ వరకు కూడా ఆయన హవా చలామణి అయింది. కాంగ్రెస్ పార్టీతో ఆయన ప్రస్థానం ప్రారంభమై.. ప్రస్తుతం వైసీపీ వరకు కొనసాగుతోంది. తన జీవిత కాలంలో ఏదో కొద్ది సమయం తప్ప.. అంతా పదవుల్లో నే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తన సోదరులు, భార్య, బంధువులను రాజకీయంగా ఆయన ప్రమోట్ చేశారు.
ముఖ్యంగా వైఎస్ కుటుంబంతో బొత్సకు మరింత సాన్నిహిత్యం ఉంది. అలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ.. ప్రస్తుత వైసీపీ అధినేత జగన్కు భయపడుతున్నారా? ఆయనను ఎదిరించలేకపోయినా.. కనీసం మాట కూడా ఎదురు చెప్పలేని దుస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు మంత్రి పయ్యావుల కేశవ్ సహా.. పలువురు టీడీపీ సీనియర్ నాయకులు. కేశవ్.. బొత్సను అత్యంత సమీపం నుంచి ఫాలో అయ్యారు.
ఇరువురి రాజకీయాలు కూడా దాదాపు ఏకకాలంలోనే ప్రారంభమయ్యాయి. అయితే.. పయ్యావులది అనంతపురం కావడం… బొత్సది విజయనగరం కావడం గమనార్హం. దీంతో బొత్స గురించి బాగా తెలిసిన వ్యక్తిగా కేశవ్ అనేక విషయాలను పంచుకున్నారు. “బొత్స ఎవరికీ భయపడేవారు కాదు.. ఎవరితో అయినా ఢి అంటే ఢీ అనే టైపే. కానీ.. ఇప్పుడు జగన్కు మాత్రం ఆయన భయపడుతున్నారు. ఇదే ఎవరికీ అర్ధం కావడం లేదు“ అని పయ్యావుల వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. మావిగన్ ప్రతిపాదన విషయంలో బొత్స విభేదిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ.. ఈ విషయంలో జగన్ను ఎదిరిస్తే.. చరమాంకంలో ఏ పార్టీలోనూ ఆయనకు చోటు ఉండదని భయపడుతున్నారని.. అందుకే తన బాధను మరోరూపంలో మరో విషయంపై వ్యక్తీకరించారని.. పేర్కొన్నారు. బొత్స కన్నీళ్లు ఎందుకు పెట్టారో.. ఆయన అంతరాత్మను అడిగితే బెటర్ అన్నారు. జగన్ను ఎదిరించలేక.. మావిగన్ అని పలకలేక బొత్స కన్నీరు పెట్టి ఉంటారని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates