బిహార్ రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతూ వస్తోన్న నితిష్ కుమార్ శకం దాదాపు ముగిసిపోయింది. ఇప్పుడు బిహార్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టనున్నారు.
నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు బిహార్ కొత్త సీఎంను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిహార్లోని ఎన్డీయే శాసనసభ్యులు అందరూ కలిసి ఓ పేరును సీఎంగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. బిహార్ బీజేపీ నేతే సీఎంగా కాబోతున్నాడన్న సంకేతాలు వచ్చేస్తున్నాయి.
ఆ నేత ఎవరో కాదు సామ్రాట్ చౌదరి. చౌదరి పేరును బిహార్ కాబోయే సీఎం అంటూ అక్కడ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. నితీష్ విషయానికి వస్తే పదే పదే కూటములు మారుస్తూ పల్టీ మార్ అనే ముద్రను నితీష్ వేసుకున్నారు. ఈ సారి అనూహ్యంగా నితీష్ యాక్టివ్ పాలిటిక్స్ నుంచే తప్పుకున్నారు.
తన చిరకాల కోరిక రాజ్యసభ సభ్యత్వం నెరవేర్చుకునే క్రమంలోనే ఆయన ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిహార్లో ఎన్డీయే కూటమిలో అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ నేతనే సీఎం పీఠంపై కూర్చోపెట్టాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ నేతలు చక్రం తిప్పేశారు.
తమ పార్టీకే చెందిన సామ్రాట్ చౌదరిని బిహార్ బీజేపీ సీఎం చేసేందుకు గేమ్ ప్లాన్ చేసేశారు. బిహార్లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కుష్వాహ సామాజిక వర్గానికి చెందిన నేతగా సామ్రాట్ ఉన్నారు. ఆయనకు యువతలో మంచి పట్టు ఉంది. నితీష్ కుమార్ కూడా గత కొంత కాలంగా తన వారసుడిగా సామ్రాట్నే ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అలాగే సామ్రాట్ పార్టీకి వీర విధేయుడిగా ఉంటున్నారు. బిహార్ రాజకీయాల నుంచి నితీష్ తప్పుకోవడంతో ఇప్పుడు అక్కడ బీజేపీని మరింత బలంగా విస్తరింప చేయాలని బీజేపీ పట్టుదలతో ఉంది.
ఇందుకు సామ్రాట్ సమర్థవంతమైన నేత అని బీజేపీ భావిస్తోంది. ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిపై నిర్ణయం తీసుకోనున్నారు. సామ్రాట్ పేరు దాదాపు ఖరారైనా కూడా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పేరు కూడా రేసులో ఉంది. అయితే సామాజిక సమీకరణలు, నితీష్ అనుకూలంగా ఉండడం, బీజేపీకి వీర విధేయుడు కావడంతో సామ్రాట్కే ఎక్కువ మొగ్గు కనపడుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates