ఈనెల 25న సొంత పార్టీ పేరు ప్రకటించడంతోపాటు సొంత జెండా అజెండాను కూడా ప్రకటిస్తానని చెబుతున్న మాజీ ఎంపీ. బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు కవిత వ్యవహారం.. ఆమె వేస్తున్న అడుగులు.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. సహజంగా ఏదైనా కొత్త పార్టీ ఏర్పడితే ఆ పార్టీ నాలుగు వైపుల నుంచి కూడా నాయకులను తీసుకునేందుకు తనదైన శైలిలో పనిచేస్తుంది. కానీ, ఈ విషయంలో కవిత చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఏ పార్టీ బలం ఎంత.. ఏ పార్టీని తాను బలహీన పరచగలను.. ఏ పార్టీ వల్ల తనకు ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది.. అనే ఈ మూడు అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని కవిత నిర్ణయాత్మక ధోరణిలో వేస్తున్న అడుగులు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐకాన్ లీడర్ గా ఉన్నారు. ఆయన ఇమేజ్ మరోసారి పార్టీని అధికారంలోకి తెస్తుందన్న బలమైన విశ్వాసం కూడా కనిపిస్తోంది.
ఇతర నాయకుల సంగతి ఎలా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. దీంతో ఆ పార్టీని కదిపితే అనవసరమైన ఇబ్బందులు తప్ప కవితకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ, అదే సమయంలో అంతర్గతంగా బలహీనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ని తన వైపు తిప్పుకోవాలన్నది కవిత ఆలోచనగా కనిపిస్తోంది. కేసీఆర్ 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించారు. కాళేశ్వరం వంటి కీలకమైన ప్రాజెక్టు నిర్మించారు. అదేవిధంగా నూతన సచివాలయం కూడా కట్టారు. కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా వంటి కీలక పథకాలను కూడా ఆయన అమలు చేశారు.
అయినప్పటికీ కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలు వంటివి బలంగా ముద్రవేసేలా రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం ప్రజల్లో ఇంకా కనిపిస్తోంది. ఈ ప్రభావం నుంచి బీఆర్ఎస్ తప్పించుకోలేకపోవడం వల్లే గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింది. ముఖ్యంగా లోక్ సభలో ప్రాతినిధ్యం కూడా కోల్పోయింది.
ఇప్పుడు అదే పార్టీతో కయ్యం పెట్టుకుని బయటకు వచ్చిన కవితకు ఇదే పార్టీ మేలు చేస్తున్న భావన కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో అనైక్యత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కెసిఆర్ నాయకత్వ వ్యవహారం ఫామ్ హౌస్ కే పరిమితమైన క్రమంలో పార్టీలో వినిపిస్తున్న లుకలుకలు, హరీష్ రావు, కేటీఆర్ కేంద్రంగా ఎప్పటికైనా పార్టీ చీలుతుంది అన్న వాదన గ్రామీణ స్థాయిలో వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ లో ఒక అనిశ్చిత వాతావరణం అయితే నెలకొంది. దీనిని తనకు అనుకూలంగా మలుచుకుంటే ఆ పార్టీ తాలూకు ఓటు బ్యాంకు తనకు చేరువ అవుతుందని కవిత అంచనా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ ను వదిలేసి బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మూడో పార్టీ బిజెపికి క్షేత్రస్థాయిలో పెద్దగా ఓటు బ్యాంకు లేకపోయినా బలమైన నాయకులైతే ఉన్నారు. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.
దీంతో కవిత బీజేపీ దిశగా అడుగులు వేయడం మానేసి క్షేత్రస్థాయిలో కేడర్ బలంగా ఉన్న బిఆర్ఎస్ ను టార్గెట్ చేయడం ద్వారా ఆ కేడర్ను తన వైపు తిప్పుకొనే దిశగా అడుగులు వేసేందుకు పక్కా ప్రణాళికతో ఉన్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి కవిత ఏదైనా చేయొచ్చని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates