‘రాధాకృష్ణకు పోలీసు భద్రత ఎల్లప్పుడూ ఉండదు’

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది. ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరిట రాజకీయ వ్యాసాలు రాస్తున్న సంగతి తెలిసిందే.

మొన్న ఆదివారం నాటి కొత్త పలుకులో వైసీపీ నేతలకు చెందిన ఆడవారిని ప్రస్తావిస్తూ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ఈ ఆందోళనలకు దిగింది. ఈ నిరసనల్లో పాలుపంచుకున్న వైసీపీ కీలక నేతలు… రాధాకృష్ణపై బూతు దండకం అందుకోవడం పలువురిని విస్మయానికి గురి చేసింది.

వైసీపీ నేతలపై రాధాకృష్ణ తన కథనంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని వాదించిన ఆ పార్టీ నేతలు తమ నిరసనల్లో రాధాకృష్ణపై అవే అనుచిత వ్యాఖ్యలు వినియోగించడం నిజంగానే విస్మయాన్ని కలుగజేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి రాజకీయాలకు దూరంగా ఉన్న మహిళలను కించపరచడం ఏ ఒక్కరికీ సరికాదనే చెప్పాలి. అయితే వారు మా ఆడవాళ్లను తిడితే… తాము మాత్రం చేతులు కట్టుకు కూర్చోవాలా? అన్న రీతి ఇప్పుడు మరింత ఎక్కువగా కనిపిస్తోందని చెప్పాలి. వెరసి ఆయా కుటుంబాల్లోని మహిళలు అనవసరంగా బదనాం అయిపోతున్నారు. 

ఏబీఎన్ ముందు ఆందోళనల్లో భాగంగా వైసీపీ  కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ తనదైన శైలిలో బూతు పురాణం అందుకున్నారు. రాధాకృష్ణను పదే పదే పేరు పెట్టి పిలిచిన ఆయన… ఆంధ్రజ్యోతిని బూతు జ్యోతిగా అభివర్ణించారు. అంతటితో ఆగని జోగి… దమ్ము, ధైర్యం ఉంటే బయటకు రావాలని రాధాకృష్ణకు సవాల్ విసిరారు.

మరో అడుగు ముందుకేసీ రాధాకృష్ణను నీవు మగాడివైతే… అంటూ మనింత ఘాటు పదజాలాన్ని వినియోగించారు. తాము అధికారంలోకి వస్తే రాధాకృఫ్ణను పరుగెత్తించి కొడతామని కూడా ఆయన వార్నింగిచ్చారు. ఇప్పుడు పోలీసు భద్రత మధ్య క్షేమంగా ఉన్నా.. పోలీసులు ఎప్పుడూ సెక్యూరిటీ ఇవ్వరన్న విషయాన్ని గ్రహించాలని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే… రాధాకృష్ణ తన కథనంలో ఏపీ రాజకీయాలను రాస్తే… వైసీపీ మాత్రం ఏపీని వదిలేసి తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని ఏబీఎన్ కార్యాలయం ముందు నిరసనకు దిగడం గమనార్హం.