పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?… ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని కూడా త‌గ్గించేలా తెర‌వెనుక వ్యూహాత్మ‌క కార్యాచ‌ర‌ణ‌కు రంగం రెడీ అవుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాజ‌కీయంగా.. వ్యాపారం ప‌రంగా కూడా.. ద్వారంపూడికి ఎర్త్ పెట్టేలా పైస్థాయిలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జరుగుతున్నాయ‌ని .. రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌ల‌మైన వాదన వినిపిస్తోంది.

దీనికి రెండు కార‌ణాలుఉన్నాయి. వైసీపీ నాయ‌కుడిగా.. కాకినాడ సిటీ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న స‌మ‌యంలో ఆయ‌న జ‌న‌సేన‌పై తీవ్ర‌స్థాయిలో యుద్ధం చేశారు. అదేస‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసి.. నిరంత‌రం రాజ‌కీయంగా ఆయ‌న దూకుడు పెంచారు. అనేక స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు కూడా 2019-24 మ‌ధ్య ద్వారంపూడి నుంచి వినిపించాయి. ఒకానొక సంద‌ర్భంగా ప‌వ‌న్ వ‌ర్సెస్ ద్వారంపూడి మ‌ధ్య మాట‌ల యుద్ధం కూడా చోటు చేసుకుంది.

ఇక‌, రాజ‌కీయంగా జ‌న‌సేనకు స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల నుంచి సెగ త‌గులుతోంది. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన రెండేళ్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ద్వారంపూడిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని.. కేవ‌లం మాట‌లకే ప‌రిమితం అవుతున్నార‌న్న‌ది స్థానికంగా వినిపిస్తున్న మాట‌. ఈ రెండు అంశాలు ఇటీవ‌ల కాలంలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్‌ను త‌న క‌నుస‌న్న‌ల్లో న‌డిపిస్తున్న ద్వారంపూడిని ఆ ప‌ద‌వుల నుంచి త‌ప్పించ‌డం ద్వారా.. ఆయ‌నను డీ గ్రేడ్ చేయాల‌ని ఉభ‌య గోదావ‌రి జిల్లాల జ‌న‌సేన నాయ‌కులు ప‌ట్టుబ‌డుతున్నారు.

ఇక‌, రాజ‌కీయంగా ఆయ‌న‌ను మ‌రింత టార్గెట్ చేసేలా వ్యూహాత్మ‌క కార్యాచ‌ర‌ణ కావాలని చెబుతున్నారు. అయితే.. ఇప్ప‌టికే కాకినాడ పోర్టు నుంచి ర‌వాణా అయ్యే బియ్యంపై ప్ర‌భుత్వం డేగ‌క‌న్ను సారించింది. దీంతో ద్వారంపూడి వ్యాపారాలు స‌గానికి స‌గం త‌గ్గిపోయాయ‌ని అంటున్నారు. అంటే.. ఒక‌ర‌కంగా ఆర్ధికంగా ఆయ‌న ఇబ్బందులు ప‌డుతున్నారు. కానీ.. కీల‌క‌మైన రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్‌ను ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డిపిస్తున్నారు.

దీనికి చెక్ పెట్టేస్తే.. ఆయ‌న‌ను అన్ని వైపుల నుంచి ఇరుకున పెట్టిన‌ట్టు అవుతుంద‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం అన్ని వైపుల నుంచి ఆలోచ‌న చేస్తోంది. ఉన్న‌ట్టుండి నిర్ణ‌యాలు తీసుకుంటే.. కీల‌క‌మైన సామాజిక వ‌ర్గం పార్టీకి దూర‌మ‌వుతుంద‌న్న ఆలోచ‌న కూడా ఉంది. ఈ క్ర‌మంలో ఒక్కొక్క మెట్టు చొప్పున ద్వారంపూడికి చెక్ పెట్టేదిశ‌గా అడుగులు వేస్తోంది. రాష్ట్ర రైస్ మిల్ల‌ర్స్ సంఘాన్ని అధికార పార్టీకి చెందిన కీల‌క నాయ‌కుడికి హ‌స్తం చేయాల‌ని యోచిస్తున్నారు.