పట్టు వదలని తుమ్మల – నిన్న బాబు.. నేడు షా!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిజంగానే పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా సాగుతున్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారం దిశగా దృష్టి సారించిన తుమ్మల… అందుకు అడ్డుగా ఉన్న విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు తీసుకువచ్చే విధంగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన తుమ్మల… తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. ఈ గ్రామాలను వీలయినంత త్వరగా తెలంగాణలో కలపాలని సదరు లేఖలో అమిత్ షాను తుమ్మల కోరారు. పాలనా సౌలభ్యం కోసం ఈ గ్రామాలను తెలంగాణలో కలపాల్సి ఉందన్న విషయాన్ని కూడా తుమ్మల సదరు లేఖలో ప్రస్తావించారు.

ఈ గ్రామాలను తెలంగాణలో కలిపితే తప్పించి గిరిజనుల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఈ గ్రామాలను తెలంగాణలో కలిపే బిల్లును ప్రవేశపెట్టాలని  ఆయన కోరారు.

తెలుగు నేల విభజన సమయంలో ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు మున్ముందు సమస్యలు తలెత్తరాదంటే… పోలవరం ముంపు ప్రాంతంలోని 7 తెలంగాణ మండలాలను ఏపీలో కలపాలంటూ నాడు ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు అడిగారు. తన డిమాండ్ ను ఆయన సాధించుకున్నారు.

అయితే ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న 5 గ్రామాలు సరిహద్దు సమస్యను ఎదుర్కొంటున్నాయి. పరిపాలనా పరంగా ఈ గ్రామాలను పట్టించుకోవడం ఏపీకి కష్టసాధ్యంగా మారింది. అదే సమయంలో అవి ఏపీలో ఉన్నందున తెలంగాణ వాటిని పట్టించుకునే అవకాశం లేదు. ఈ పరిస్థితిని తొలగించాలంటే.. ఆ 5 గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణలో కలిపి తీరక తప్పని పరిస్థితి. ఇదే విషయాన్ని తుమ్మల తన భుజానికెత్తుకున్నారు.