బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే కొత్త పార్టీని ప్రకటించనున్న ఆమె.. చాలా వ్యూహాత్మకంగా బీఆర్ ఎస్ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. పార్టీ పేరు నుంచి పార్టీ గుర్తు వరకు ఆమె.. బీఆర్ ఎస్ పార్టీకి సెగ పెంచేస్తున్నారు.
గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ పార్టీగా అవతరించి.. రాష్ట్ర సాధనకు కృషి చేసిన ఈ పార్టీ పేరు తర్వాత.. కాలంలో బీఆర్ ఎస్ పార్టీగా మారింది. అయితే.. ప్రస్తుతం టీఆర్ ఎస్ పార్టీ పేరు ఖాళీగా ఉందని.. కాబట్టి దీనిని ఎవరైనా వాడుకోవచ్చని తాజాగా కవిత హింటిచ్చారు. అంతేకాదు.. పాత పార్టీ.. కొత్త అజెండా అని కూడా నినదించారు. దీంతో ఆమెకొత్త పార్టీ పేరు టీఆర్ ఎస్ అయి ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది.
దీంతో హుటాహుటిన బీఆర్ ఎస్ కేంద్ర ఎన్నికల సంఘంలో పిటిషన్ వేయాలని.. టీఆర్ ఎస్ పేరును వేరే వారికి అలొకేట్ చేయరాదని కోరుతున్నట్టు జాతీయ స్థాయిలో చర్చ తెరమీదికి వచ్చింది. ఈ చర్చ ఒకవైపు సాగుతున్న క్రమంలో బీఆర్ ఎస్ కు మరో షాక్ ఇస్తూ.. కవిత కీలక నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా చర్చ తెరమీదికి వచ్చింది. ఆమె తన పార్టీ గుర్తును `బస్సు`గా నిర్ణయించుకునే దిశగా నాయకులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
ఇదే జరిగితే.. బీఆర్ ఎస్ ఎన్నికల గుర్తు కారుకు.. కవిత పెట్టబోయే పార్టీ ఎన్నికల గుర్తు బస్సుకు మధ్య చాలానే పోలికలు ఉండనున్నాయి. దీంతో ఓటు బ్యాంకు తీవ్రంగా ప్రబావితం అవుతుంది.. తద్వారా బీఆర్ ఎస్కు ఇది శరాఘాతంగా మారుతుంది. అయితే.. సహజంగా ఒక పార్టీ గుర్తును పోలిన ఎన్నికల గుర్తును మరో పార్టీకి కేటాయించరు. దీనిపై కొంత మీమాంస ఉంటుంది. మరి కవిత బస్సు కోసమే పట్టుబడితే.. ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates