సాక్షి కార్టూన్… చంద్రబాబుకు ప్లస్ అయ్యిందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో చంద్ర‌బాబు పిల్లిమొగ్గ‌లు వేస్తున్నారంటూ.. జ‌గ‌న్ సొంత మీడియాలో ఓ కార్టూన్ వ‌చ్చింది. కార్టూనిస్టు స్వేచ్ఛ‌ను ఎవ‌రూ హ‌రించ‌లేదు. నిర్బంధాలు కూడా పెట్ట‌లేరు. కానీ.. దీని వెనుక ఉన్న ఔచిత్యాన్ని మాత్రం ప్ర‌శ్నించ‌డంలో త‌ప్పులేదు. అమ‌రావతి నేమ్ బోర్డును ప‌ట్టుకున్న సీఎం చంద్ర‌బాబు.. ఒక‌సారి నెత్తిమీద‌, మ‌రోసారి కుడి వైపు.. ఇంకోసారి ఎడ‌మవైపు.. మ‌రోసారి.. త‌ల‌కిందు లుగా ప‌ట్టుకుని ఉన్న‌ట్టుగా ఈ కార్టూన్ గీశారు.

దీని అంత‌రార్థం.. చంద్ర‌బాబు అమ‌రావ‌తితో ఆడుకుంటున్నార‌ని.. ఆయ‌న పిల్లిమొగ్గ‌లు వేస్తున్నార‌ని చెప్ప‌డ‌మే. అంతేకాదు.. కార్టూన్‌కు ఇచ్చిన క్యాప్ష‌న్ కూడా ఇలానే ఉంది. అమ‌రావ‌తి రైతుతో చంద్ర‌బాబు మాట్లాడుతున్న‌ట్టుగా.. గీసిన ఈ కార్టూన్‌లో అమ‌రావ‌తి ఇప్ప‌ట్లో పూర్తికాద‌ని.. ఇదే ఆరంభ‌మ‌ని వ్యాఖ్యా నించిన‌ట్టు పేర్కొన్నారు. మొత్తంగా ఏపీ రాజ‌ధాని విష‌యంలో చంద్ర‌బాబు వైఖ‌రి ఇదీ అని చెప్పే ప్ర‌య‌త్నం అయితే జ‌రిగింది.

ఒకే.. ఆ విష‌యానికి వ‌చ్చినా..చంద్ర‌బాబు ఒకే మాట‌పై ఉంటున్నారు. 2014-19 మ‌ధ్య ఒక మాట‌.. పార్టీ ఓడిపోయిన త‌ర్వాత‌.. 2019-24 మ‌ధ్య మ‌రోమాట మాట్లాడ‌లేదు. ఆది నుంచి అమ‌రావ‌తినే ఆయ‌న రాజ‌ధాని అని చెబుతున్నారు. రైతుల త్యాగాల‌ను గుర్తించాల‌ని సూచిస్తున్నారు. దీనిలో ఎలాంటి తేడా లేదు. ఇక‌, ఇప్పుడు కూట‌మి హ‌యాంలో మ‌రింత విస్త‌రించాల‌ని భావిస్తున్నారు. అంటే.. త‌డ‌వ‌కోమాట ఆయ‌న చెప్ప‌క‌పోగా.. రాజ‌ధానిని విశాల ప్ర‌జాహితాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నారు.

ఈ క్ర‌మంలో నిజంగానే చంద్ర‌బాబు అనేక క‌ష్టాలు పడుతున్నారు త‌ప్ప‌.. పిల్లి మొగ్గ‌లు కాదు. కానీ.. అదే వైసీపీని తీసుకుంటే.. ముందు అమ‌రావ‌తికి అనుకూలంగా ఉన్నామ‌ని 2014-19 మ‌ధ్య విప‌క్షంలో ఉన్న‌ప్పుడు చెప్పారు. అధికారంలోకి వ‌చ్చాక మూడు రాజ‌ధానులు అన్నారు. ఇక‌, ఇప్పుడు అధికారం పోయాక‌..

మావిగన్‌(మ‌చిలీప‌ట్నం+విజ‌య‌వాడ‌+గుంటూరు)ను ప్ర‌తిపాదించారు. సో.. దీనిని బ‌ట్టి ఎవ‌రు పిల్లిమొగ్గ‌లు వేస్తున్నారో.. ఎవ‌రు రాజ‌ధానిపై ఒక నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నారో అర్ధ‌మ‌వుతోంద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కార్టూన్ ఒక విధంగా చంద్రబాబుకు కలిసొచ్చేదే అంటూ నాయకులు చెబుతున్నారు.