వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిందని, వారికి న్యాయం జరిగేలా దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయని, మరి ఈ విషయంలో జగన్ వైఖరి ఏంటని ఆమె ప్రశ్నించారు. జగన్కు దళిత క్రైస్తవుల ఓట్లు అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వారి తరఫున గళం వినిపించిన జగన్ కేవలం వారి ఓట్ల కోసమే మభ్యపెట్టారని విమర్శించారు. కేవలం జగన్ ఓటు బ్యాంకు కోసమే దళిత క్రైస్తవులను వినియోగించుకుంటున్నారని ఆరోపించారు.
ఇక జగన్ కూడా దళితుల పక్షం అని నిరూపించుకున్నారు. మరి దళిత క్రైస్తవుల మాటేంటి? వారి ఓటు అవసరం లేదా? అధికారంలో ఉన్నన్నాళ్లు బీజేపీకి దత్తపుతుడుగా ఉన్నారు. బీజేపీ బిల్లులకు, నిర్ణయాలకు మద్దతు ఇచ్చారు. రాష్ట్రంలో దళిత క్రైస్తవులు జగన్కు ఓటేశారు. ఇప్పుడు వారికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? వారి ఓట్లు అవసరం లేదా? అయితే అవసరం లేదని బహిరంగ ప్రకటన జారీ చేయండి. అప్పుడు మిమ్మల్ని ప్రశ్నించం. అని షర్మిల వ్యాఖ్యానించారు.
అంతేకాదు, కేంద్రంపై ఒత్తిడి చేయడంలోనూ జగన్ చతికిల పడ్డారని షర్మిల ఎద్దేవా చేశారు. దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతున్న క్రమంలో ప్రధాని మోదీ దగ్గరకు మీ ఎంపీలను తీసుకువెళ్లి అడగలేరా? ఇన్నాళ్లు మీ బిల్లులకు మద్దతు ఇచ్చాం, కానీ సుప్రీంకోర్టు తీర్పులో దళితులకు న్యాయం జరుగుతోంది అని అడగలేరా? దళిత క్రిస్టియన్లు మాకు ఓటేశారు అని మీ ఎంపీలను తీసుకెళ్లి మోదీని అడగలేరా? దళిత క్రిస్టియన్ల పక్షాన నిలబడలేరా? అని నిలదీశారు. ఈ మేరకు విజయవాడలో వామపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు.
సుప్రీంకోర్టు తీర్పు ఇదీ
పుట్టుకతో దళితులు అయిన వ్యక్తులు ఏ రూపంలో అయినా క్రిస్టియానిటీని అవలంబిస్తే వారు ఎస్సీ హోదాను కోల్పోతారని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పుట్టుకతో ఎస్సీ రిజర్వేషన్ వచ్చినప్పటికీ క్రిస్టియన్గా మారితే ఆ తరహా రిజర్వేషన్ అమలు ఉండదని సంచలన తీర్పు ఇచ్చింది. దీనిపైనే దేశవ్యాప్తంగా క్రిస్టియానిటీ తీసుకున్న ఎస్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
