జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి సిద్ధమయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక అగ్రనేత ఇలా రెండు చోట్ల పోటీ చేయడం కొత్తేమీ కాదు, కానీ సుమారు 35 ఏళ్ల తర్వాత విజయ్ ఈ సాహసం చేస్తున్నారు. 1991లో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత, మళ్లీ ఏ స్టార్ లీడర్ కూడా ఈ రిస్క్ తీసుకోలేదు.

నిజానికి రెండు చోట్ల పోటీ చేసే ట్రెండ్ 1950వ దశకంలోనే ప్రారంభమైంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 1957లో రెండు లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి ఒక చోట గెలిచారు. ఆ తర్వాత సోనియా గాంధీ, నరేంద్ర మోదీ వంటి నేతలు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. తమిళనాడులో మాత్రం జయలలిత ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 1991లో బర్గూర్, కంగేయం నియోజకవర్గాల నుంచి గెలిచి ఆమె తన ప్రభావాన్ని చూపించారు. 1996లో వచ్చిన సంస్కరణల తర్వాత ఒక వ్యక్తి రెండు స్థానాలకు మించి పోటీ చేయకూడదనే నిబంధన అమల్లోకి వచ్చింది.

విజయ్ ఎంచుకున్న పెరంబూర్ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ డీఎంకే అభ్యర్థి ఆర్ డీ శేఖర్ తో విజయ్ తలపడనున్నారు. పెరంబూర్ లో విజయ్ పార్టీ టీవీకే కు సుమారు 40 వేల మంది సభ్యులు ఉండటం ఆయనకు ప్రధాన బలం. ఇది ఒకప్పుడు రిజర్వ్డ్ స్థానంగా ఉండేది, కానీ 2008 తర్వాత జనరల్ కేటగిరీగా మారింది. ఇక్కడ డీఎంకే, అన్నా డీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఉండేది. అయితే విజయ్ ఎంట్రీతో సమీకరణాలు మారిపోయాయి. ఈ స్థానాన్ని తన బలమైన కేంద్రంగా భావిస్తూ విజయ్ ఇక్కడ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

మరోవైపు తిరుచ్చి ఈస్ట్ లో కూడా పోటీ ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇక్కడ డీఎంకే నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే ఇనిగో ఇరుదయ రాజ్ మళ్లీ బరిలో ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో అన్నా డీఎంకే ఎక్కువసార్లు గెలిచింది. ఇప్పుడు బలమైన పోటీ మధ్య విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

క్షేత్రస్థాయిలో ప్రజలు మార్పును కోరుకుంటే విజయ్ కు మంచి అవకాశం ఉంటుంది. జయలలిత లాగే రెండు చోట్లా గెలిచి చరిత్ర సృష్టిస్తారా లేదా అన్నది ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. సెంగోట్టైయన్, ఆధవ్ అర్జున వంటి కీలక నేతలు కూడా పోటీలో ఉన్నారు.

జయలలిత 2001లో నాలుగు చోట్ల నామినేషన్లు వేసి తిరస్కరణకు గురైనా, తన పార్టీని విజయానికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు విజయ్ కూడా అదే తరహాలో తన సినీ ఇమేజ్ ను ఓట్లుగా మార్చుకుని అసెంబ్లీలో అడుగుపెడతారా అన్నది ఏప్రిల్ 23 పోలింగ్ తేల్చనుంది.