తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసిన `కాళేశ్వరం` ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. ఈక్రమంలో లక్ష కోట్ల రూపాయలను తినేశారని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి మంత్రి చెప్పినప్పటికీ.. ఆయన కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.. పైగా కీలకమైన జలశక్తిశాఖకు మంత్రిగా ఉన్నారు. దీంతో మంత్రి ప్రకటన కేంద్రం చేసిన ప్రకటనగానే భావించాలని పరిశీలకులు చెబుతున్నారు.
కేవలం అవినీతి.. అక్రమాలేకాదు.. ప్రాజెక్టుపై సీఆర్ పాటిల్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. డిజైన్, నిర్మాణం, ప్రణాళికల లో పాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విఫలం కావడానికి కారణమని వివరించారు. తాజాగా పార్లమెంటులోని తన కార్యాలయం లో కొందరు బీజేపీ సభ్యులు ఈ అంశాన్ని ప్రశ్నించినప్పుడు.. కాళేశ్వరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈ ప్రాజెక్టు వ్యవహారా న్ని తాము నిశితంగా గమనిస్తున్నామన్నారు. తమ శాఖ సీనియర్ అధికారులు కూడాదీనిపై అధ్యయనం చేస్తున్నారని చెప్పా రు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
వివాదాల ప్రాజెక్టు!
కాళేశ్వరం ప్రాజెక్టును గత కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. దీనిని అప్పట్లో తెలంగాణ కు జీవనాడిగా.. వెన్నెముకగా కూడా కేసీఆర్ అభివర్ణించారు. అయితే.. దీనికి సంబంధించిన లోపాలు బయటపడడం.. అప్పటి కి ఆయన ప్రభుత్వం పడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. లక్షల కోట్ల అవినీతి జరిగిందని.. కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం అంటూ.. వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించారు. కేసీఆర్.. అప్పటి జలవనరుల మంత్రి హరీష్రావుపైనా కాంగ్రెస్ నాయకులు నిప్పులు చెరిగారు.
ఈ క్రమంలోనే మాజీ న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్.. సుదీర్ఘ విచారణ చేసి నివేదికను ఇచ్చింది. పలు సందర్భాల్లో కేసీఆర్ను ఈ కమిషన్ విచారించింది. ఇటీవల అసెంబ్లీలోనూ ఈ వ్యవహారం రచ్చరేపిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల క్రమంలోనే కేంద్రం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే.. దీనిపై కేంద్రం చర్యలు తీసుకుంటుందా? అనే విషయంపై మాత్రం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్పందించలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates