ఔను! అసెంబ్లీలో ఏ తీర్మానం అయినా ప్రవేశ పెట్టేందుకు.. సంబంధిత శాఖకు మంత్రులుగా ఉన్నవారు వాటిని ప్రవేశ పెడతారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీలో అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని మాత్రం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రవేశ పెట్టారు. ఇలా.. ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో కూడా ఆయన ఏ తీర్మానాన్నీ ప్రవేశపెట్టలేదు.
వాస్తవానికి సీఆర్ డీఏ పరిధిలో ఉన్న అమరావతికి సంబంధించిన బిల్లును మునిసిపల్ శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ ప్రవేశపెట్టాలి. గతంలోనూ అమరావతికి సంబంధించిన పలు బిల్లులను ఆయనే ప్రవేశపెట్టారు. అయితే..దీనికి భిన్నంగా చంద్రబాబు అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని తానే స్వయంగా ప్రవేశపెట్టారు. తద్వారా.. అమరావతికి.. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్టు అయింది. అంతేకాదు.. ప్రభుత్వానికి అమరావతి ఫస్ట్ ప్రియార్టీ అన్న సంకేతాలు కూడా పంపించారు.
తొలుత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి నుంచి అనుమతి తీసుకున్నది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబే కావడం గమనార్హం. అమరావతి ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజేశామని.. కేంద్రం ద్వారా ఇప్పుడు చట్టబద్ధత కల్పించేందుకు.. ప్రయత్నిస్తున్నామన్నారు. అనంతరం.. మంత్రి నారాయణ ప్రసంగించారు. సుమారు 20 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. తర్వాత.. ఇతర మంత్రులు కూడా ప్రసంగించారు.
రాజధాని ప్రాంతంలో ప్రత్యేక తెరలు!
అమరావతిపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి సంబంధించిన రాజధాని ప్రాంతంలోని పలు చోట్ల ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి.. ప్రత్యక్ష ప్రసారం చేశారు. రైతులు.. స్థానిక ప్రజలు అక్కడికి వచ్చి అసెంబ్లీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించారు. అదేవిదంగా రాజధాని ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ టీవీలకు అతుక్కుపోయారు. రాజధానిపై తొలి తీర్మానం కావడం.. ఇక, మార్చేందుకు వీలులేని విధంగా దీనిని తీసుకువస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates