జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ఉనికిని ప్రశ్నార్థకం చేసిన వైసీపీ తిరిగి అధికారంలోకి రాదన్న ఆయన… ఒకవేళ ఆ పార్టీ అధికారం చేపట్టినా… తన ఇష్టారాజ్యంగా ముందుకు సాగే అవకాశం ఉండదని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమీ చేలేదని పవన్ చెప్పారు.
చట్టసభల్లో కూర్చుని దాడులు చేస్తామంటే తాము చూస్తూ ఊరికే కూర్చునే పరిస్థితి లేదని కూడా పవన్ తేల్చి చెప్పారు. మళ్ల వైసీపీ వస్తే ఏమిటని ఆర్సెలర్ మిట్టల్ ప్రతినిధులతో పాటు అందరూ అడుగుతున్నారని… అందరికీ తాను ఇదే సమాధానం ఇస్తున్నానని పవన్ చెప్పుకొచ్చారు.
ఏపీకి శాశ్వత రాజదానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలనే తీర్మానాన్ని ఆమోదించేందుకు ఏపీ అసెంబ్లీ శనివారం ఒక్కరోజు ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ఈ సందర్బంగా తీర్మానాన్ని సభా నాయకుడి హోదాలో సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రతిపాదించగా…దానిపై పలువురు మంత్రులు, కూటమి పార్టీల సభ్యులు మాట్లాడిన తర్వాత పవన్ కూడా మాట్లాడారు.
ఈ సందర్భంగా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ కొనసాగుతున్న తీరు తనకు తీరని బాధ కలిగిస్తోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ ఉండటం తనను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు.
తెలంగాణ, ఏపీ అన్న భేద భావన ఇప్పటికీ చాలా మందిలో ఉందన్న పవన్… తనలో మాత్రం ఆ భావన లేదన్నారు. తెలంగాణ, ఏపీ వేర్వేరు కాదని, ఈ రెండు రాష్ట్రాలు తెలుగు నేలగా తాను భావిస్తానని ఆయన తెలిపారు. పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడితే… నాడు ఏపీతో పాటు చాలా రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటయ్యాయని ఆయన చెప్పారు.
రాజధాని కూడా లేకుండా నూతన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అమరావతి కోసం బాబును నమ్మి రైతులు 33 వేల ఎకరాలను ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పవన్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ ప్రభుత్వం చేసిన చర్యలను పవన్ తూర్పారబట్టారు. అప్పటిదకా ఏపీ రాజధానిగా అమరావతికి తాము ఓకేనని చెప్పిన వైపీనీ… తాను అధికారంలోకి రాగానే అమరావతిని నిర్వీర్యం చేసే దిశగా చర్యలు చేపట్టిందని ఆయన విమర్శించారు.
నాడు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను చూశాకే రాష్ట్రానికి వస్తున్న ప్రతి పారిశ్రామికవేత్త తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాని ఆయన అన్నారు. ఈ ప్రశ్న చివరకు ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ నుంచి కూడా వినిపించిందని పవన్ తెలిపారు. అయితే తిరిగి వైసీపీ అధికారంలోకి రాదని తాము వారికి చెప్పినట్లుగా ఆయన తెలిపారు.
వైసీపీ అధికారంలోకి రావడమనేది కూటమి నాయకుల చేతుల్లోనే ఉందని.. మనలోని ఐక్యత కోల్పోతే అప్పుడు వైసీపీ వాళ్లకు బలం చేకూరుతుందని.. రాష్టం కోసం మనమందరం కలిసే ఉండాలని పవన్ ఈ సందర్భంగా మరోసారి పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates