ఏపీ అసెంబ్లీలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సినీ కమెడియన్ తో పోలుస్తూ బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబ్ధత కల్పించాలన్న తీర్మానాన్ని ఆమోదించేందుకు శనివారం నాడు ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది.
ఈ సమావేశంలో అమరావతి తీర్మానాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టగా… ఆ తీర్మానాన్ని బలపరుస్తూ పలువురు సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రాన్ని ప్రస్తావించారు. ఆ సినిమాలో బ్రహ్మానందం పాత్రతో ఆయన జగన్ ను పోల్చారు.
రాజధాని అమరావతిపై జగన్ ఆది నుంచి అబద్ధాలు, రెండు నాల్కల ధోరణితో సాగుతున్నారని సత్యకుమార్ ఆరోపించారు. రాజధానిపై జగన్ వైఖరిని చూస్తుంటే తనకు ఓ సినిమా గుర్తుకు వస్తోందని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం అబద్ధాలు చెబుతూ ఉంటే… ఓ చెట్టుకు ఉన్న ఆకులు రాలుతూ ఉంటాయని ఆయన గుర్తు చేశారు.
ఆ సినిమా సీన్ మాదిరే జగన్ ను నల్లమలకు తీసుకెళ్లి మాట్లాడిస్తే అక్కడి చెట్ల ఆకులన్నీ రాలతాయని తెలిపారు. అలా జగన్ ను ఓ 10 నిమిషాలు మాట్లాడిస్తే… నల్లమలలోని చెట్ల ఆకులన్నీ రాలిపోతాయని, చివరకు ఆ చెట్లు మోడువారిపోతాయని ఆయన మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాను సీఎంగా ఉన్న ఐదేళ్లలో రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసే దిశగా జగన్ అడుగులు వేశారని సత్యకుమార్ ఆరోపించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ మాట మార్చేశారని, తాను అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని చెబుతున్నారని విమర్శించారు.
తాను అమరావతి పరిధిలో ఇల్లు కట్టుకున్నానని, అమరావతి తీర్మానానికి మద్దతు ఇచ్చానని చెబుతున్నారని అన్నారు. ఈ మాటలతో తాను ఐదేళ్లలో చేసిన పాపాలను జనం మరిచిపోతారని జగన్ భావిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రాజధాని పట్ల ఏ రీతిన వ్యవహరించిన విషయాలను జనం ఎప్పటికీ మరిచిపోరని సత్యకుమార్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates