మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే అనే ముందుచూపు చంద్రబాబు నాయుడు విజన్ కు నిదర్శనం అని వైయస్ షర్మిల అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నారని అన్నారు. ఈ తీర్మానం పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమే అని కూడా వ్యాఖ్యానించారు. మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే..అని ముందుచూపు ఉండడం మీ విజన్ కి నిదర్శనం అని చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు.
అయితే ఇదే సమయంలో మరి రాజధాని కోసం విభజన చట్టంలో పెట్టిన సెక్షన్ 94(3) సంగతేంటి అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. సెక్షన్ 5 ( సబ్ సెక్షన్ 2) లో ఎట్ అమరావతి పదాన్ని పెట్టించేందుకు ఉన్న శ్రద్ధ.. సెక్షన్ 94(3) కింద అమరావతి ఫండ్స్ అడిగేందుకు లేదా ? గెజిట్ తోనే అమరావతి గెయిన్ అవుతుందా ? ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ భాద్యత కేంద్రానిదే అని తెలియదా ? ఎంతైతే అంత కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే అనే క్లాజ్ సెక్షన్ 94(3d) చదవలేదా ? అంటూ ప్రశ్నించారు.
కేంద్రం చేస్తున్న మోసంపై, నిధులు హక్కుగా ఇవ్వాల్సిందేనని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తుందని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మోడీ గారిచ్చిన చెంబుడు నీళ్లు, తట్టెడు మట్టితో సరిపెట్టుకుందామా ? ఇదే బీజేపీ రాజధానికి ఇచ్చిన గొప్ప ప్రసాదంగా భావిద్దామా ? అసలొద్దు.. అప్పులిప్పిస్తే చాలని రాజీపడదామా? పదో పరకో ముష్టిగా పడేస్తుంటే ఇప్పటికింతే సంతోషం అనుకుందామా? అమరావతికి నిర్మాణానికి పట్టే రూ.లక్ష కోట్లు ప్రజల నెత్తిమీద వేద్దామా? అని షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నలను సంధించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates