గుంటూరు రాజకీయం వేడెక్కుతుంది

గుంటూరు తూర్పు.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న నియోజ‌క‌వ‌ర్గం ఇదే!. అయితే.. దీనిపైనే ఎక్కువ‌గా టాక్ న‌డుస్తోంది. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు ఉన్నాయి. 1) ప్ర‌స్తుత ఎమ్మెల్యే వైఖ‌రి. 2) వైసీపీలో ఏర్ప‌డుతున్న గ్యాప్‌. ఈ రెండు అంశాలు కూడా రాజ‌కీయంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తున్నాయి. కూట‌మి పార్టీల త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో న‌జీర్ అహ్మ‌ద్ పోటీ చేసి విజ‌యం ద‌క్కించు కున్నారు. ఈయ‌న‌కు రాజ‌కీయంగా మంచి ఫామ్ క‌నిపిస్తోంది.

అయితే.. ఇదే కూట‌మిలో వ‌చ్చే ఎన్నిక‌ల‌లో టికెట్ ద‌క్కించుకునేందుకు మ‌రో కీల‌క నాయ‌కుడు ప్ర‌య త్నిస్తున్నారు. దీంతో ఇరు ప‌క్షాలుగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. దీనివల్ల కూట‌మికి న‌ష్టం ఏమీ క‌నిపించ‌డం లేదు. కానీ, రెండు వ‌ర్గాల రాజ‌కీయం మాత్రం జోరుగా ముందుకు సాగుతోంది. ఎమ్మెల్యే ప‌నుల‌కు కొంద‌రు సీనియ‌ర్లు గైర్హాజ‌రువుతున్నారు. మ‌రికొంద‌రు సొంత‌గా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.

ఇది అంత‌ర్గ‌తంగా విభేదాలు సృష్టించే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల గుంటూరులో ఇఫ్తార్ విందు ఇచ్చే విష‌యంలోనూ ఈ విభేదాలు క‌నిపించాయి. దీంతో పార్టీత‌ర‌ఫున వెంట‌నే దిద్దుబాటు చ‌ర్యలు జ‌రిగాయి. ఇక‌, వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాలు మ‌రింత పెరుగుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా త‌ప్పుకొని ఆయ‌న కుమార్తెకు అవ‌కాశం ఇచ్చారు. కానీ ఆమె ఓడిపోయారు. ఇదిలావుంటే.. అంత‌ర్గ‌తంగా మాత్రం నాయ‌కుల మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్నాయ‌ని అంటున్నారు.

నూరి ఫాతిమా వైఖ‌రిపై ఇప్ప‌టికే వైసీపీ అధిష్టానానికి అనేక ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో వేచి చూసేధోర‌ణి అవ‌లంభిస్తున్నారు. ఇదిలావుంటే.. అటు కూట‌మిలోనూ.. ఇటు వైసీపీలోనూ ఇలా అంత‌ర్గ‌త విభేదాలు చోటు చేసుకోవ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. కొత్త నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఈవిష‌యంపై పార్టీలు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డంలేదు. దీంతో త‌మ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఇటు కూట‌మిలోనూ.. అటు వైసీపీలోనూ చ‌ర్చగా మారింది.