ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రఖ్యాత భద్రాచలం ఆలయాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ పనులకు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా భూమి పూజ చేశారు. మొత్తంగా 3 దశల్లో ఈ ఆలయాన్ని విస్తరించనున్నారు. తాజాగా 351 కోట్ల రూపాయలతో చేపట్టనున్న తొలి దశ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.
ఎందుకు?
భద్రాచలం ఆలయాన్ని విస్తరించాలన్నది కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. ఆలయానికి మరింత ప్రాభవం పెరిగింది. అదేసమయంలో రాష్ట్రంలోని అతిపెద్ద ఆలయాల్లో భద్రాచలం కూడా ఒకటిగా ఉంది. గతంలో 1000 కోట్ల రూపాయలను ఖర్చుచేసిన యాదగిరి నరసింహ క్షేత్రాన్ని అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం అభివృద్దిచేసింది. అయితే.. కారణాలు ఏవైనా కూడా.. కొంత మేరకు ఆశించిన ఫలితం రాలేదు.
ఈ క్రమంలో రెండో అతిపెద్ద దేవాలయంగా ఉన్న భద్రాచలాన్ని విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి 1000 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. మూడు దశల్లో చేపట్టే నిర్మాణంలో భక్తులకు మరిన్ని వసతి గృహాలను నిర్మించనున్నారు. అలాగే ప్రధాన ఆలయ ప్రాకారాన్ని కూడా విస్తరించనున్నారు. ఆలయ ప్రాంగణంలోనే సీతారాముల వారి కళ్యాణం చేసేందుకు కూడా నిర్ణయించుకు న్నారు.
ఈ నేపథ్యంలోనే ఆలయ విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తిరుమల తరహాలో దీనిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక, తాజాగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని జరిగిన కల్యాణం కమనీయంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సహా.. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క దంపతులు.. మరికొందరు మంత్రులు కూడా కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే తొలి దశ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates