కరోనా ప్రబలిన వేళ.. యావత్తు ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఎలాంటి విపత్కర సరిష్థితులను ఎదురు చూశామన్న విషయం ప్రతి ఒక్కరికీ విదితమే. తాజాగా అలాంటి పరిస్థితులు లేకున్నా కూడా దేశంలో మరోమారు లాక్ డౌన్ తప్పదంటూ గడచిన రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో అయితే ఓ రేంజిలో చర్చ సాగుతోంది.
వెరసి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తప్పదా అన్న భయాందోళనలు నెలకొన్నాయి. అయితే లాక్ డౌన్ వార్తలు నిరాధారమంటూ స్వయంగా కేంద్రం శుక్రవారం ఓ కీలక ప్రకటన చేసింది. మరి లాక్ డౌన్ పరిస్థితులు లేకున్నా… ఆ దిశగా దేశ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తడానికి కారణమెవరు? అంటే… సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, దాని ద్వారా దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై మోదీ ఓ కీలక ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రసంగంలో ఆయన లాక్ డౌన్ పదాన్ని వాడారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం కరోనా నాటి పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని తెలిపారు.
ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని కూడా మోదీ పిలుపునిచ్చారు. మోదీ నోట నుంచి లాక్ డౌన్ అన్న పదం వినిపించినంతనే దేశంలో మరోమారు లాక్ డౌన్ తప్పదన్న ప్రచారం చిన్నగా మొదలై గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. రెండు రోజులు గడిచేసరికి ఈ భయాందోళనలు మరింతగా పెరిగిపోయాయి. అయితే ఇక్కడ కేవలం అటువంటి పరిస్థితులు వచ్చినా.. దేశ ప్రజలు కలిసి కట్టుగా నిలబడాలని పిలుపు ఇవ్వడమే ప్రధాని ఉద్దేశం అనేది కాదనలేని విషయం.
ఈ ప్రచారం విన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు ముక్కున వేలేసుకున్నారు. లాక్ డౌన్ తరహా ఆంక్షలేవీ అమలు చేసే ఉద్దేశ్యం లేదని, అంతేకాకుండా ఆ దిశగా అసలు చర్చే జరగలేదని కేంద్ర మంత్రులు విస్మయం వ్యక్తం చేశారు. అలాగని వెంటనే ఈ తరహా ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రంగంలోకి దిగారు.
దేశంలో మరోమారు లాక్ డౌన్ తరహా ఆంక్షలను అమలులోకి తీసుకురావాలన్న ఆలోచనేది లేదని, దీనిపై జరుగుతున్న ప్రచారమంతా ఊహాజనితమైనదని నిర్మల ప్రకటించారు. తాజాగా శుక్రవారం సోషల్ మీడియా వేదికగా హర్దీప్ సింగ్ పూరి ఓ కీలక పోస్టును పెట్టారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలముకున్నప్పటికీ… దేశ అవసరాలకు సరిపడా ఇంధనం వస్తోందని, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ అన్న మాటకే ఆస్కారం లేదని అందులో పూరీ ఓ విస్పష్ట ప్రకటన చేశారు. లాక్ డౌన్ దిశగా సాగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates