దేశంలో ఫ‌స్ట్‌.. గుడ్డుతోపాటు చేప‌లు కూడా!

చిన్నారుల‌కు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అందించే మ‌ధ్యాహ్న భోజ‌నంలో ఇక నుంచి చేప‌ల కూర కూడా వ‌చ్చించ‌నున్నట్టు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీధ‌ర్ చెప్పారు. ప్ర‌స్తుతం ఇస్తున్న గుడ్డుతోపాటు.. వారానికి ఒక‌సారి లేదా వీలునుబ‌ట్టి రెండు సార్లు చేప‌ల కూర కూడా వ‌డ్డించేందుకు.. ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం ఇస్తున్న కోడిగుడ్డు ఫ‌లితంగా విద్యార్థుల్లో భౌతిక సామ‌ర్థ్యాలు మెరుగుప‌డుతున్నాయ‌న్నారు.

ముఖ్యంగా పౌష్ఠికాహార లోపం త‌గ్గుతోంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం కోడిగుడ్ల ఉత్ప‌త్తిలో రాష్ట్రం ముందు వ‌రుస‌లో ఉంద‌ని.. ఇంకా మ‌రింత దిగుబ‌డి వ‌చ్చేలా పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హిస్తామ‌న్నారు. త‌ద్వారా అంగ‌న్ వాడీలు, స్కూళ్ల‌లో వారానికి మ‌రిన్ని సార్లు కోడిగుడ్లు ఇచ్చే విధంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నట్టు వివ‌రించారు. ఇక‌, చేప‌ల ఉత్ప‌త్తిలోనూ రాష్ట్రం దూసుకుపోతోంద‌న్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో విద్యార్థుల‌కు పెడుతున్న మ‌ధ్యాహ్న భోజ‌నంలో చేప‌ల‌ను కూడా వ‌డ్డించాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌న్నారు. ప్రాథ‌మిక ద‌శ‌లో వారానికి ఒక‌సారి త‌ర్వాత‌.. రెండేసి సార్లు చేప‌ల కూర‌, లేదా పులుసును ఇచ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. చిన్నారుల్లో దృష్టి సంబంధ‌మైన స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయ‌ని.. చేప‌ల ద్వారా ఆ స‌మస్య‌ను అధిగ‌మించేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

దేశంలో ఫ‌స్ట్‌..

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. ఈ భోజ‌నంలో కోడిగుడ్డును ఇవ్వ‌డం(వారానికి రెండు సార్లు) త‌ప్ప‌నిస‌రి. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో చిక్కీలు (ప‌ల్లీ చెక్క‌లు) కూడా ఇస్తున్నారు. కొన్నిచోట్ల రాగి సంక‌టిని.. మ‌రికొన్ని చోట్ల జొన్న రొట్టెల‌ను కూడా అందిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ల కూర‌ను వ‌డ్డించాల‌ని తీసుకున్న నిర్ణ‌యం దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌. ఇది అమ‌లైతే.. మ‌రిన్ని రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తుంది.