బీజేపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. మ‌న‌సులు క‌ల‌వ‌ని మిత్ర‌త్వం

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌ని అంటారు. ఇది ఎలా ఉన్నా.. రాను రాను.. రాజ‌కీయాల్లో మిత్రుల మ‌ధ్య మ‌రో కోణం కూడా క‌నిపిస్తోంది. క‌లిసే ఉన్నా.. ఎవ‌రి ప్ర‌యోజ‌నం వారిది.. ఎవ‌రి వ్యూహాలు వారివి.. ఎవ‌రికి రేంజ్ పెరిగితే.. వారు సైడ్ అయిపోవ‌డం.. అనేవి కామ‌న్ అయిపోయాయి. ఇదే ప‌రిస్థితి కాదుకానీ.. ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉన్న బీజేపీ-జ‌న‌సేన కూట‌మిలోనూ క‌నిపిస్తోంది. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఈ రెండు పార్టీలు పైకి క‌లిసే ఉన్నా.. మ‌న‌సులు మాత్రం ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా ఉన్నాయ‌నే భావ‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ విష‌యంలో ఇరు పార్టీల ప్ర‌యోజ‌నాలు భిన్నంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక టికెట్ విష‌యంలో రెండు పార్టీల మ‌ధ్య చాలా దూరం క‌నిపిస్తోంది. రాష్ట్ర నేత‌లు క‌లిసి కూర్చుని తేల్చాల్సిన ఈ విష‌యాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టేసిన‌ప్పుడే.. ఈ రెండు పార్టీల మ‌ధ్య పైకి అవ‌గాహ‌న‌.. లోప‌ల వేరే ఉద్దేశాలు ఉన్నాయ‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. మేం గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు.. అంటే..తిరుప‌తి టికెట్ ఇస్తార‌నే, ఇవ్వాల‌నే క‌దా! అని జ‌న‌సేన నేత‌ల వాద‌న. మీరు పోటీ చేసినా.. చేయ‌క‌పోయినా.. ప్ర‌చారం చేస్తామ‌ని ఎందుకు త‌ప్పించుకున్నారు? అనేది జ‌న‌సేనాని ప‌వ‌న్ ను ఉద్దేశించి బీజేపీ అంత‌ర్గ‌త ప్ర‌శ్నాశ‌రం! ఇక‌, ఇప్ప‌టికే తిరుప‌తి నుంచి పోటీ చేసేది బీజేపీ అభ్య‌ర్థేనని సోము వీర్రాజు ప్ర‌క‌టించ‌డం.. ఈ అంత‌ర్గ‌త మిత్ర విభేదానికి మ‌రింత పెట్రోల్ పోసింది.

ఇక‌, జ‌న‌సేన‌లోనూ దూకుడు పెరిగింది. స్థానిక నాయ‌కుల‌తో కూడిన క‌మిటీని వేసిన ప‌వ‌న్‌.. తిరుప‌తిలో గెలిచే స‌త్తా ఎవ‌రికి ఉందో తేల్చేయాల‌ని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన జ‌న‌సేన‌క‌మిటీ.. స‌హ‌జంగా త‌మ‌కు మాత్ర‌మే గెలిచే స్కోప్ ఉందంటూ.. ప‌వ‌న్‌కు ఓ నివేదిక అందించింది. ఇది ఎలా లీక్ అయిందో తెలియ‌దు కానీ.. బీజేపీ నేత‌ల‌కు చేరిపోయింది. దీంతో క‌మ‌లం పార్టీ నేత‌లుప‌వ‌న్ శైలిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మాకు గెలుపు గుర్రం ఎక్కే స్కోప్ లేద‌ని ఎలా తీర్మానం చేస్తారు. మీరు అధ్య‌యనం చేయాలంటే.. మా పార్టీ త‌ర‌ఫున స‌భ్యుల‌ను కూడా తీసుకుని మ‌న రెండు పార్టీల్లో ఎవ‌రికి స్కోప్ ఉందో తేల్చేస్తే బాగుండేద‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో నిప్పులు చెరుగుతున్నారు.

ఇక‌, ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న వారు..రేపు తిరుపతి టికెట్‌ను బీజేపీకి ఇచ్చినా.. లేక జ‌న‌సేన అభ్య‌ర్థినే నిల‌బెట్టే అవ‌కాశం ఉన్నా.. ఇరు పార్టీల మ‌ధ్య విభ‌జ‌న రేఖ స్ప‌ష్టంగా పైకి తేల‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అంతేకాదు.. ప్ర‌చారం విష‌యంలో ఒక పార్టీ ముందుకు వ‌స్తే.. మ‌రో పార్టీ మొహ‌మాటానికి కార్య‌క‌ర్త‌ల‌ను పంపించి వ‌దిలేసినా ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే బీజేపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య నొస‌టితో న‌వ్వుతూ.. వ్యూహాల క‌త్తులు నూరుకునే రాజ‌కీయం తెర‌మీదికి వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.