టీడీపీ లీడర్లను జనసేన నేతలు మోయలేరట

జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూటమి పార్టీలలోని సఖ్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల నుంచి బొలిశెట్టి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు.

కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాల కేడర్ కలుస్తున్నారని, లీడర్లు కలవడం లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ కేడర్ ను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని, కానీ, టీడీపీ లీడర్లను మోయడం జనసేన నేతలు, కార్యకర్తల వల్ల కాదని తేల్చి చెప్పారు.

అంతేకాదు, ఈ విషయం సీఎం చంద్రబాబుతోనే నేరుగా చెప్పానని, అయినా ఫలితం లేదని బొలిశెట్టి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో జనసేన నేతలకు తగిన గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే నేను, మంత్రి, ప్రభుత్వం మాది అనే స్థాయిలో వారు ఉన్నప్పుడు వారిని పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదని బొలిశెట్టి తేల్చి చెప్పారు.

తమకూ పార్టీ, నాయకుడు ఉన్నారని, సంకీర్ణ ప్రభుత్వంలో ఎవరూ ఎక్కువ, తక్కువ కాదని…అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరముందని, అలా కాదని తానే గొప్ప అంటే డోంట్ కేర్ అని, ఎవడూ లెక్క చేయడని బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.

జనసేన నేతలను చిన్న చూపు చూస్తున్నారని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని పవన్ కు తెలియజేస్తామని చెప్పారు. అయితే, బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్లపై సీఎం చంద్రబాబు, జనసేనాని పవన్ కూర్చొని మాట్లాడుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికైనా పవన్, బాబు అసలు పరిస్థితి ఎలా ఉంది అని చర్చిస్తే భవిష్యత్తులో బొలిశెట్టి శ్రీనివాస్ వంటి నేతలు బహిరంగంగా ఈ విషయంపై కామెంట్స్ చేయరు. మరి, బొలిశెట్టి శ్రీనివాస్ కామెంట్లపై పవన్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.